Voter roll revision: అక్టోబర్ నుంచి దేశవ్యాప్తంగా ఓటర్ జాబితాల ప్రత్యేక సవరణ ప్రారంభం కానున్నట్లు ఎలక్షన్ కమీషన్ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారుల సమావేశంలో దీనిపై చర్చించారు, ఆమోదం కూడా లభించినట్లు తెలుస్తోంది. బీహార్ ఎన్నికలు ముగిసే లోపు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రకటన రావచ్చు. కాన్ఫనెన్స్ కమ్ వర్క్ షాప్ సందర్భంగా ఓటర్ జాబితా సవరణకు ఎంత త్వరగా సిద్ధంగా ఉండొచ్చని కేంద్ర ఎన్నికల సంఘం అడిగినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నాటికి ప్రాథమిక పనులు పూర్తవుతాయని, అక్టోబర్ లో ప్రారంభించడానికి మార్గం సుగమం అవుతుందని చాలా మంది అధికారులు కమిషన్కు హామీ ఇచ్చారని తెలుస్తోంది.
కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ జాబితా సవరణను నిర్వహించింది. ఈ ప్రక్రియ దేశవ్యాప్తంగా విస్తరించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సవరణ ప్రధాన లక్ష్యం మరణించిన వారి పేర్లు, వేరే ప్రాంతానికి మారిన ఓటర్లను జాబితా నుంచి తొలగించడం, అక్రమ ఓటర్లను ఏరిపారేయడం.
ఇటీవల బీహార్ రాష్ట్రంలో కేంద్రం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అమలు చేయడం సంచలనంగా మారింది. అక్రమ ఓటర్ల గుర్తించి, ఎన్నికల జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తోంది. అయితే, ఈ ప్రక్రియను ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీ వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఎన్నికల కమిషన్పై విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ-ఈసీ కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎస్ఐఆర్ని సవాల్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు, కొన్ని సంఘాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఎన్నికల సంఘం చేపట్టిన ఈ చర్య వల్ల చాలా మంది పౌరులు తమ ఓటు హక్కును ఉపయోగించుకోలేరని ప్రతిపక్షాలు సుప్రీంని ఆశ్రయించాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే బీహార్లో ఎన్నికల సంఘం నిర్వహించిన ఎస్ఐఆర్ ప్రక్రియను నిలిపేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టు దీనిని ‘‘రాజ్యాంగ ఆదేశం’’గా పేర్కొంది. రాజ్యాంగ సంస్థ పనితీరులో జోక్యం చేసుకోలేమని చెప్పింది. ఇటీవల బీహార్లో ఈ ప్రక్రియ ద్వారా 65 లక్షల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తీసేశారు.