Nagpur: ఏదో సినిమాలో చెప్పినట్లు ఒక హిందువు ఈశ్వరుడిని, ముస్లిం అల్లాను, క్రిస్టియన్ ఏసు ప్రభువునే ప్రార్థిస్తాడు, కానీ అన్ని మతాల వాళ్లు డాక్టర్ని ప్రార్థిస్తారని హీరో డైలాగ్ చెబుతాడు. ఇది నిజం అనారోగ్యంతో వచ్చిన వ్యక్తికి డాక్టరే దేవుడు. ఇలాంటి ఆదర్శప్రాయమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ డాక్టర్ మాత్రం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ‘టీ’ ఇవ్వలేదని ఆపరేషన్ మధ్యలో వదిలేసి వెళ్లిపోయాడు.
ఈ ఘటన నాగ్పూర్లో జరిగింది. స్టెరిలేజేషన్ సర్జరీ(వేసక్టమీ)(కుటుంబ నియంత్రణ) మధ్యలో వదిలిసి వెళ్లాడు ఓ డాక్టర్. తనకు టీ ఇవ్వలేదని ఆపరేషన్ మధ్య నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. నగరంలోని మౌడా ప్రాంతంలో ప్రభుత్వం ఆస్పత్రిలో 8 మంది మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం పిలిచారు. నలుగురు మహిళలకు శస్త్రచికిత్స తర్వాత, డాక్టర్ భాలవి ఆస్పత్రి సిబ్బందిని ఒక కప్పు టీ అడిగాడు, అయితే సిబ్బంది టీ ఇవ్వకపోవడంతో ఆపరేషన్ థియేటర్ నుంచి వెళ్లిపోయాడు.
Read Also: CM Nitish Kumar: జనాభా నియంత్రణపై నితీష్ కుమార్ వివాదాస్పద వ్యాఖ్యలు..
అయితే అయితే ఈ ఘటనపై మాట్లాడిన డాక్టర్.. తనకు షుగర్ ఉందని సమయానికి టీ, బిస్కెట్లు కావాలని చెప్పానని, ఇవి లేకుంటే రక్తంలో చెక్కర స్థాయి పడిపోతుందని, బీపీ తగ్గుతుందని, అందుకే అక్కడి నుంచి వెళ్ళాల్సి వచ్చిందని వెల్లడించారు.
ఈ ఘటన జరిగిన సమయంలో నలుగురు మహిళలు అనస్థీషియా మత్తులో ఉన్నారు. ఆపరేషన్ ముందు వీరికి మత్తు మందు ఇచ్చారు. డాక్టర్ ఆపరేషన్ మధ్యలో వదిలేసి వెళ్లిపోయిన విషయాన్ని మహిళ బంధువులు జిల్లా వైద్యాధికారికి చెప్పారు. వెంటనే వేరే వైద్యుడిని ఆస్పత్రి పిలిపించింది. ఈ ఘటనపై నాగ్పూర్ జిల్లా పరిషత్ సీఈఓ సౌమ్యశర్మ మాట్లాడుతూ.. ఈ ఘటనపై దర్యాప్తు కోసం కమిటీని ఏర్పాటు చేశామని, నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.