Abbas Ansari: మాఫియా డాన్ ముఖ్తార్ అన్నారీ కుమారుడు అబ్బాస్ అన్సారీని ‘‘ద్వేషపూరిత ప్రసంగం’’ కేసులో కోర్టు దోషిగా తేల్చింది. ఉత్తర్ ప్రదేశ్ మౌ సదర్ ఎమ్మెల్యేగా ఉన్న అబ్బాస్కి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. కోర్టు తీర్పుతో ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం, అతడి ఎమ్మెల్యే పదవి రద్దు అవుతుంది. 2022లో అధికారులను బెదిరిస్తూ ఆయన ద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ఇదే కేసులో ఆయన సోదరుడు మన్సార్ అన్సారీని కూడా దోషిగా తేల్చింది, ఇతడికి ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ. 1000 జరిమానా విధించింది.
Read Also: Pakistan Spy: ‘‘పాకిస్తాన్ సొంత ఇళ్లులా అనిపిస్తుంది’’.. గూఢచారిని పట్టించిన ఇంటర్వ్యూ..
ఎన్డీయే మిత్రపక్షమైన సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ(SBSP) ఎమ్మెల్యే అయిన అబ్బాస్ అన్సారీ ఇప్పుడు అసెంబ్లీ నుంచి అనర్హత వేటు ఎదుర్కోవాల్సి ఉంటుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో, మౌ సదరన్ స్థానం నుంచి పోటీ చేస్తున్న అబ్బాస్ అన్సారీ, మార్చి 3, 2022న పహర్పూర్ గ్రౌండ్లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ మౌ లో పనిచేస్తున్న ప్రభుత్వం అధికారులను బెదిరించారు. ‘‘అందరి లెక్క చూస్తాను, వారికి గుణపాఠం చెబుతా’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు. “ఆరు నెలల పాటు ఎటువంటి బదిలీలు లేదా పోస్టింగ్లు జరగవని నేను అఖిలేష్ యాదవ్తో చెప్పాను. మొదట, అధికారుల లెక్కలు తేల్చిన తర్వాతే బదిలీలు ఉంటాయి’’ అని బెదిరించారు.
ఈ వ్యాఖ్యలపై విచారణ జరిపిన ప్రత్యేక ఎంపీ/ఎమ్మెల్యే కోర్టు జడ్జి కేపీ సింగ్ శనివారం అబ్బాస్ని దోషిగా నిర్ధారించారు. ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పుని సెషన్స్ కోర్టులో సవాల్ చేస్తానని అబ్బాస్ అన్సారీ చెప్పారు. ప్రస్తుతం ఆయనకు తాత్కాలిక బెయిల్ లభించింది. అబ్బాస్ అన్సారీ తండ్రి ముఖ్తార్ అన్సారీ 2024 మార్చిలో బందా జిల్లా జైలులో గుండెపోటుతో మరణించాడు. మౌ సదర్ స్థానం నుండి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 2005 నుండి యుపి, పంజాబ్లలో జైలులో ఉన్నారు. ఆయనపై 60 కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి.