Uttar Pardesh: ఉత్తర్ ప్రదేశ్లో పోలీసులు జరిపిన ఎన్కౌంటర్లో ముక్తార్ అన్సారీ, సంజీవ్ జీవా ముఠాలతో సంబంధం ఉన్న మోస్ట్ వాంటెడ్ వ్యక్తి, షార్ప్ షూటర్ షారూఖ్ పఠాన్ హతమయ్యాడు. అనేక హత్యల కేసుల్లో ఇతను వాంటెడ్గా ఉన్నాడు. బెయిల్ తర్వాత పరారీలో ఉన్నాడు. ఆదివారం ముజఫర్ నగర్లో ఉత్తర్ ప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF)తో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందాడని అధికారులు తెలిపారు.
అనేక హత్యలు, దోపిడీల కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇతను జైలు శిక్ష అనుభవించినప్పటీకి, బెయిల్ తర్వాత బయటకు వచ్చి పరారీలో ఉన్నాడు. ముజఫర్నగర్లోని ఖలపర్ నివాసి అయిన జరీఫ్ కుమారుడు షారుఖ్ పఠాన్, సంజీవ్ జీవా ముఠాకు నమ్మకమైన షార్ప్షూటర్ అని పోలీసులు తెలిపారు. 2015లో ముజఫర్నగర్ రైల్వే స్టేషన్లో పోలీస్ కస్టడీలో ఉన్న ఆసిఫ్ జయాదా అనే వ్యక్తిని కాల్చి చంపినప్పుడు పోలీసుల దృష్టి ఇతడిపై పడింది. అరెస్ట్ తర్వాత, జైలులో ఉన్న మాఫియా డాన్ ముఖ్తార్ అన్సారీ, జీవాలతో పరిచయం ఏర్పడి, వీరి గ్యాంగుల కోసం పనిచేయడం ప్రారంభించాడు.
Read Also: What is Black Magic: బ్లాక్ మ్యాజిక్ అంటే ఏంటి..? అసలు చేతబడులు ఉన్నాయా..?
2016లో పఠాన్ ముజఫర్నగర్ పోలీస్ కస్టడీ నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత ఏడాది జీవా సూచనల మేరకు హరిద్వార్ కు చెంది గోల్డీ అనే వ్యాపారిని హత్య చేశాడు. అదే ఏడాది హత్య కేసులో సాక్షిగా ఉన్న ఆసిఫ్ జయదా తండ్రిని హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇతడి తలపై రూ. 50000 రివార్డు ఉంది. గోల్డీ హత్య కేసులో జీవాతో పాటు ఇతడిని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించారు.
6 నెలల క్రితం బెయిల్పై విడుదలైన పఠాన్, పెండింగ్ హత్య కేసుల్లో సాక్షులుగా ఉన్న వారిని బెదిరించడం, చంపేందుకు ప్రయత్నించాడు. జూలై 14న మీరట్లోని ఏఎస్టిఎఫ్ ఫీల్డ్ యూనిట్ అతన్ని ముజఫర్నగర్లోని చాపర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో గుర్తించింది. ఎన్కౌంటర్ సమయంలో, పఠాన్ తీవ్రంగా గాయపడి అరెస్టు చేయబడ్డాడు కానీ ఆసుపత్రిలో మరణించాడు. పోలీసులు అతడి నుంచి పెద్ద ఎత్తున బుల్లెట్స్, గన్స్ స్వాధీనం చేసుకున్నారు.