పశ్చిమ బెంగాల్లో బీజేపీ వర్సెస్ తృణమూల్ కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ నడుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై గత వారం దాడి జరినప్పటి నుంచి పరిస్థితులు ఉద్రిక్తతంగా మారాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వంపై మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
‘‘నాతో ఆడుకున్నారు.. సమయం వచ్చినప్పుడు నేను ఇంకా పెద్ద ఆట ఆడతాను.’’ అంటూ బీజేపీకి వార్నింగ్ ఇచ్చారు. రేపు కోల్కతాలో నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. జూన్ 2న కోల్కతాలోని రాణి రాస్మోని రోడ్డులో ఒక రోజు పాటు మమత ధర్నా చేపట్టనున్నారు. డబ్బు, అధికారంతో టీఎంసీని విచ్ఛిన్నం చేయలేరని మమత పేర్కొన్నారు.
వర్చువల్గా పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ఉద్దేశించి మమత మాట్లాడారు. టీఎంసీ పార్టీని చీల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. టీఎంసీ ఎమ్మెల్యేలను పార్టీ సమావేశాలకు హాజరుకాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని.. వారిని బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. ‘‘టీఎంసీని విచ్ఛిన్నం చేస్తామని ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. ఈరోజు మీకు మంచి సమయం.. అందుకే మీరు ఇలా చేస్తున్నారు. నా సమావేశానికి రావద్దని ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. సమావేశానికి రాకముందు పోలీసులు ఫోన్లో బెదిరించారని నా పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు నిన్న ఫిర్యాదు చేశారు..’’ అని తెలిపారు. ‘‘నేను సమావేశానికి వెళ్లినప్పుడల్లా నా అనుమతిని రద్దు చేస్తున్నారు. సామాన్య ప్రజలను రక్షించడం పోలీసుల పని. పోలీసులను చూస్తే నాకు సిగ్గుగా ఉంది. రక్షించడమే వారి పని. కానీ వాళ్లు ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారు. నా భద్రతను కూడా ఉపసంహరించుకున్నారు. మీరు నాతో ఒక ఆట ఆడారు. నేను దీనికంటే పెద్ద ఆట ఆడతాను. దయచేసి కొంచెం ఆగండి.’’ అని అన్నారు.
‘‘మీరు మా పార్టీని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. గతంలో చాలా మంది బీజేపీ నాయకులు నాతో సంప్రదింపులు జరిపారు, నేను వారికి సహాయం చేశాను. కానీ ఇప్పుడు మీరేం చేస్తున్నారు?. టీఎంసీ మరింత బలపడుతుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలబడటం లేదని గొప్ప గొప్ప ఆరోపణలు చేస్తున్నవారు ఈ రోజు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారు. ఇక్కడ పూర్తి అరాచకం నెలకొని ఉంది. హిట్లర్ కూడా ఇలాంటి పనులు చేయలేదు. ఈ పరిస్థితిని వర్ణించడానికి మాటలు లేవు. ఎందుకంటే భాష విఫలమైనప్పుడు.. అణచివేత అన్ని హద్దులు దాటిందని అర్థం. కొందరు ఎమ్మెల్యేలను, ఎంపీలను బెదిరించడం లేదా లంచాలు ఇవ్వడం ద్వారా మీరు టీఎంసీని బలహీనపరచలేరు. నిజానికి ఇది పార్టీని మరింత బలోపేతం చేస్తుంది.’’ అని పేర్కొన్నారు.
తన మేనల్లుడు అభిషేక్పై జరిగిన దాడిని ప్రస్తావిస్తూ.. ఆ హింసాకాండలో పాల్గొన్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ‘‘అభిషేక్పై దాడి జరిగినప్పుడు.. మీరు తప్పుడు వ్యక్తులను అరెస్టు చేశారు. మీరు బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయలేదు. మీరు బయటి నుంచి బీజేపీ వాళ్లను తీసుకువచ్చి.. వారికి ఆహార ప్యాకెట్లు కూడా ఇచ్చారు. నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి.’’ అని అన్నారు.
బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా లక్ష్యంగా చేసుకుని.. ‘‘బీజేపీ అధ్యక్షుడు అతను (అభిషేక్) బతికే ఉన్నాడని చెబుతున్నారు. మా హయాంలో మీరు కూడా బతికే ఉన్నారని నేను చెబుతాను. మీరు టీఎంసీని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రెండో అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ ఎంపీపై మీరు దాడి చేసిన తీరు దిగ్భ్రాంతి కలిగించింది. వైద్యులను పిలిపించినప్పటికీ.. చికిత్స అందించవద్దని ఆస్పత్రులకు ఆదేశాలు జారీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇది ఎలాంటి అసంబద్ధమైన, నియంతృత్వ ప్రవర్తన? బెల్లే వ్యూ ప్రజలు నా పాదాలకు నమస్కరించేవారు. మీకు బిర్లాలు, లోధాలతో సన్నిహిత సంబంధాలు, లావాదేవీలు ఉండేవి. అయినా మీరు వారి ముందు తలవంచారు. మా మేయర్ అన్నీ చూసుకున్నారు. ఆరు నెలల క్రితం మేము అపోలో లైసెన్సును పునరుద్ధరించాం.’’ అని చెప్పుకొచ్చారు.
