Kiren Rijiju: ఉత్తర-దక్షిణ భారతదేశం మధ్య విభజన ప్రేరేపిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. దేశాన్ని ఇలా విభజించొద్దని హితవు పలికారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా మనమంతా భారతీయులమే అని చెప్పారు. ఉత్తరాది రాష్ట్రాల అభివృద్ధికి తన పన్నుల్ని వినియోగిస్తున్నారని, దక్షిణాది ప్రజల్ని ‘‘ద్వితీయ శ్రేణి పౌరులు’’గా చూస్తున్నారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. దీనికి కౌంటర్గా రిజిజు ఘాటు సమాధానం ఇచ్చారు. ఇదే కాకుండా, దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలను విస్మరించి, ఉత్తరాదికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ సీఎం ఆరోపించారు.
‘‘ప్రధాని ఉత్తర భారతదేశానికి చెందినవారు. రాష్ట్రపతి కూడా ఉత్తర భారతదేశానికి చెందినవారే. దీనికి కారణం మాకు ప్రాతినిధ్యం వహించే శక్తి మీకు (బీజేపీకి) లేకపోవడమే’’ అని రేవంత్ రెడ్డి బెంగళూర్లో జరిగిన ఒక మీడియా సమావేశంలో ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గుతుందని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ వ్యాఖ్యలకు రిజిజు కౌంటర్ ఇస్తూ.. ‘‘రాష్ట్రపతి తూర్పు భారతదేశంలోని ఒడిశాకు చెందిన వినయశీలి, అంకితభావం గల గిరిజన వ్యక్తి. ప్రధానమంత్రి పశ్చిమ భారతదేశంలోని గుజరాత్లో జన్మించిన మంచి నాయకుడు. ఉపరాష్ట్రపతి దక్షిణ భారతదేశంలోని తమిళనాడుకు చెందిన ఒక సామాన్య వ్యక్తి’’ అని ఎక్స్లో ట్వీట్ చేశారు.

