Kerala High Court: నిర్దిష్ట దేవుళ్లు, అమరవీరుల పేర్లను ప్రస్తావిస్తూ ‘‘ప్రమాణ స్వీకారం’’ చేయడం చెల్లదని కేరళ హైకోర్టు చెప్పింది. తిరువనంతపురం కార్పొరేషన్లో 20 మంది బీజేపీ కౌన్సిలర్లు ప్రమాణస్వీకారం విషయంలో షాక్ ఇచ్చింది. నాలుగు వారాల్లో వారంతా మళ్లీ ప్రమణాస్వీకారం చేయాలని ఆదేశించింది. సీపీఎం కార్పొరేటర్ ఎస్పీ దీపక్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఈ ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటివరక కార్పొరేటర్లుగా ప్రజాప్రతినిధులుగా నిర్వహించిన అధికారిక చర్యలు చట్టబద్ధంగానే ఉంటాయని కోర్టు స్పష్టం చేసింది.
ఎన్నికైన ప్రతినిధులు దేవుని పేరుతో లేదా రాజ్యాంగం పేరుతో మాత్రమే ప్రమాణం చేయాల్సి ఉంటుందని, నిర్దిష్ట దేవుళ్ల పేర్లను ప్రస్తావించడం అనేది నిర్దేశిత ప్రమాణ స్వీకార విధానానికి మరియు రాజ్యాంగ సూత్రాలకు విరుద్ధమని పిటిషనర్ వాదించారు. ఈ తీర్పుపై తిరువనంతపురం మేయర్ వీవీ రాజేష్ మాట్లాడుతూ.. హైకోర్టు ఆదేశాలను కార్పొరేషన్ పాటిస్తుందని, ఆ 20 మంది కార్పొరేటర్ల ప్రమాణస్వీకారం కోసం ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ తీర్పు వారిని పదవికి అనర్హులుగా చేయదని ఆయన అన్నారు.

