Kerala: ‘‘కాంగ్రెస్ ముస్లిం లీగ్’’.. సీఎం ఎంపికపై బీజేపీ ఫైర్..

  • కేరళ సీఎంగా వీడీ సతీషన్..
  • ఐయూఎంఎల్‌కు తలొగ్గిందని బీజేపీ విమర్శ..
  • కాంగ్రెస్ ముస్లిం లీగ్ అంటూ ఆరోపణలు..
Kerala Politics

Kerala Politics

Kerala: కేరళ‌లో ముఖ్యమంత్రి ఎవరనే దానిపై కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. వీడీ సతీషన్‌ను గురువారం హైకమాండ్ సీఎంగా ఎంపిక చేసింది. కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నతల మధ్య పదవి కోసం పోటీ ఉన్నప్పటికీ సతీషన్‌ వైపు అధిష్టానం మొగ్గు చూపింది. ఇదిలా ఉంటే, సతీషన్ ఎంపికపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్‌ను ‘‘ముస్లింలీగ్’’గా అభివర్ణించింది. యూడీఎఫ్ కూటమిలో కీలక భాగస్వామి అయిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఒత్తిడితోనే ఈ ఎంపిక జరిగిందని ఆరోపించింది.

కాంగ్రెస్ ఐయూఎంఎల్‌కు తలొగ్గిందని, బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఆరోపించింది. కేరళలో భారీ గెలుపు తర్వాత 10 రోజులకు సీఎం ఎంపిక పూర్తయింది. ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కీలక పాత్ర పోషించిన నాయకుడిగా సతీషన్‌కు పేరుంది. ఐయూఎంఎల్ కూడా సతీషనే ముఖ్యమంత్రి కావాలని కాంగ్రెస్‌కు అల్టిమేటం విధించినట్లు వార్తలు కూడా వచ్చాయి.

కేరళలో కాంగ్రెస్‌కు 63 సీట్లు ఉంటే, ఐయూఎంఎల్‌కు 22 సీట్లు ఉన్నాయి. ఒక వేళ కాంగ్రెస్ కేసీ వేణుగోపాల్‌ను సీఎంగా నియమిస్తే, ఐయూఎంల్ మద్దతు ఉపసంహరించుకుంటే మ్యాజిక్ ఫిగర్ 71 చేరదు. గతంలో రాహుల్ గాంధీ, ఇప్పుడు ప్రియంకాగాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్‌లో ముస్లిం లీగ్‌కు గణనీయమైన పరపతి ఉంది. ఈ ప్రాంతంలో 45 శాతం మైనారిటీ ఓటర్లు ఉన్నారు.