Kamal Haasan: మధ్యప్రాచ్యంలో యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్ దెబ్బతింటోంది. ఇప్పటికే ఇరాన్ ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా ఉన్న ‘‘హార్మూజ్ జలసంధి’’ని మూసేసింది. దీంతో ఇండియా, చైనాతో పాటు దక్షిణాసియా, ఆగ్నేయాసియా దేశాలు ఇంధన సంక్షోభంలో చిక్కుకునే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు, ఇరాన్ గల్ఫ్ దేశాలైన కువైట్, ఖతార్, యూఏఈ, బహ్రైయిన్, సౌదీ అరేబియాలపై దాడులు చేస్తోంది. దీంతో ఆయా దేశాలు చమురు, గ్యాస్ మౌలిక సదుపాయాలను మూసేశారు.
ఇదిలా ఉంటే, రష్యా నుంచి భారత్ చమురు కొనుక్కోవడానికి అమెరికా అనుమతి ఇచ్చిందంటూ ఓ వార్త వైరల్గా మారింది. అయితే, దీనికి ప్రతిగా..‘‘తమకు ఎవరి అనుమతి అవసరం లేదని, మార్కెట్లో ఎక్కడ తక్కవ ధరకు చమురు దొరికితే అక్కడే కొనుగోలు చేస్తాం’’ అని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా వ్యాఖ్యలపై రాజ్యసభ ఎంపీ మరియు మక్కల్ నీది మయ్యం చీఫ్ కమల్ హాసన్ మండిపడ్డారు. . “ప్రియమైన మిస్టర్ ప్రెసిడెంట్, మేము, భారతదేశ ప్రజలు, స్వేచ్ఛాయుతమైన, సార్వభౌమ దేశానికి చెందినవాళ్ళం. మేము ఇకపై సుదూర విదేశీ తీరాల నుండి ఆర్డర్లను తీసుకోము. దయచేసి మీ సామర్థ్యాల మేరకు మీ సొంత పనుల్ని చూసుకోండి” అంటూ ఎక్స్లో విమర్శలు గుప్పించారు.
Read Also: Iran war: ఇరాన్ పాలనలో చీలిక, నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు.? అమెరికా-ఇజ్రాయిల్ ప్లాన్ సక్సెస్..
“సార్వభౌమ దేశాల మధ్య పరస్పర గౌరవం శాశ్వత ప్రపంచ శాంతికి ఏకైక పునాది. మీ దేశం, దాని ప్రజలు శాంతి, శ్రేయస్సును కోరుకుంటున్నాము” అని ఆయన అన్నారు. యూఎస్ ట్రెజరీ కార్యదర్శి, ట్రంప్ సహాయకుడు స్కాట్ బెసెంట్ ఇటీవల మాట్లాడుతూ.. రష్యా చమురు కొనుగోలు చేయడానికి అమెరికా భారతదేశానికి “అనుమతి” ఇచ్చిందని చెప్పారు. మేము చమురు కొనుగోలు ఆపమని చెబితే వారు అలానే చేశారు, ప్రపంచవ్యాప్తంగా తాత్కాలిక చమురు అంతరాన్ని తగ్గించడానికి మేము వారిని రష్యన్ ఆయిల్ కొనేందుకు అనుమతి ఇచ్చామని చెప్పారు.
నిజానికి హార్ముజ్ జలసంధి మూసేయడం వల్ల భారత్కు ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏం లేదని తెలుస్తోంది. భారత్ తన చమురు అవసరాల కోసం 27 నుంచి 40 దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటోంది. గయానా, రష్యా, వెనిజులా ఇలా పలు ప్రాంతాల నుంచి ఆయిల్ కొనుగోలు చేసుకుంటోంది. గల్ఫ్ దేశాల నుంచి ఆయిల్ రాకపోయినా, భారత్ ఇబ్బంది లేదని కేంద్రం చెబుతోంది.