Ayodhya Ram Mandir: రామ మందిర్ ట్రస్ట్లో కలకలం.. చంపత్ రాయ్ వ్యాఖ్యలతో మళ్లీ వేడెక్కిన వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayodhya Ram Mandir: అయోధ్య రామ మందిర్ ట్రస్ట్లో గత 24 గంటల్లో చోటుచేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ట్రస్ట్ సమావేశానికి ముందు నెలకొన్న ఉత్కంఠ, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ప్రాథమిక నివేదిక, ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామాలు, చంపత్ రాయ్ స్పందన, అనిల్ మిశ్రాపై దర్యాప్తు వంటి పరిణామాలతో ట్రస్ట్ వ్యవహారం కొత్త మలుపు తిరిగింది.
ట్రస్ట్ సమావేశానికి ముందు హైడ్రామా
రామ మందిర్ ట్రస్ట్ సమావేశానికి ముందు ఛోటీ చవానీలో హైడ్రామా నెలకొంది. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ సమావేశానికి హాజరు కావాలంటూ సీనియర్ అధికారులు గంటల పాటు చర్చలు జరిపారు. చివరకు ఆయన సమావేశానికి అంగీకరించారు. అలాగే పలువురు బయటి ట్రస్టీలు, సాధువులు, ఋషులను కూడా సమావేశానికి హాజరయ్యేలా ఒప్పించారు. సమావేశానికి ముందు మహంత్ నృత్య గోపాల్ దాస్ విడుదల చేసిన లేఖలో విరాళాల దుర్వినియోగంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూనే, దోషులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీలపై తనకు పూర్తి విశ్వాసం ఉందని పేర్కొన్నారు.
Also Read
- CM Vijay: 20 ఏళ్ల తర్వాత కీలక నిర్ణయం.. మద్యం షాపుల్లో పని చేసే ఉద్యోగులకు భారీగా జీతాలు పెంపు
- Gurugram: గురుగ్రామ్పై జలఖడ్గం.. 10 కి.మీ ట్రాఫిక్ జామ్.. ఎటుచూసినా నీళ్లే
- Bihar: ప్రశాంత్ కిషోర్కు పోటీగా బీజేపీ నుంచి అభిషేక్ కుమార్.. బంకీపూర్ బైపోల్స్లో టఫ్ ఫైట్
- Wayanad: వయనాడ్లో కొండచరియలు బీభత్సం.. నలుగురు మృతి.. వీడియో వైరల్
రాజీనామాల ఆమోదం.. ప్రశాంతంగా మారిన వాతావరణం
ట్రస్ట్ సమావేశంలో చంపత్ రాయ్, అనిల్ మిశ్రాల రాజీనామాలను ఆమోదించారు. దీంతో ట్రస్ట్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పడుతున్నాయని భావించారు. అయితే ఆ ప్రశాంతత ఎక్కువసేపు కొనసాగలేదు.
మౌనం వీడిన చంపత్ రాయ్
SIT ప్రాథమిక నివేదిక వెలువడిన మరుసటి రోజే చంపత్ రాయ్ సోషల్ మీడియాలో స్పందించారు. రామభక్తులను ఉద్దేశించి విడుదల చేసిన లేఖలో తనపై వచ్చిన ఆరోపణలను పూర్తిగా ఖండించారు. ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలేనని, త్వరలో అన్ని అంశాలపై పూర్తి వివరాలతో స్పందిస్తానని తెలిపారు. తాను 41 సంవత్సరాలుగా ప్రచారకుడిగా పనిచేస్తున్నానని, 1991 నుంచి అయోధ్య రామ మందిర్ ఉద్యమంతో అనుబంధం కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు.
SIT ముందు ఇచ్చిన వాంగ్మూలం లీక్
చంపత్ రాయ్ స్పందన అనంతరం ఆయన SITకు ఇచ్చిన లిఖితపూర్వక వాంగ్మూలంలోని కొన్ని అంశాలు బయటకు వచ్చాయి. ఆ వివరాల ప్రకారం, విరాళాల పెట్టెల లెక్కింపు, నగదు బ్యాంకులో జమ చేసే ప్రక్రియలో తనకు ఎలాంటి పాత్ర లేదని ఆయన స్పష్టం చేశారు. బ్యాంకుతో కుదిరిన అవగాహన ఒప్పందం (MoU)పై తన సంతకం లేదని, ఆ ప్రక్రియలో జరిగిన మార్పులు, కరెన్సీ లెక్కింపు విధానం, భద్రతా వ్యవస్థపై తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు.
అనిల్ మిశ్రాపై పెరిగిన అనుమానాలు
బ్యాంకుతో కుదిరిన MoUపై అనిల్ మిశ్రా సంతకం చేసినట్లు సమాచారం వెలుగులోకి రావడంతో దర్యాప్తు దృష్టి ఇప్పుడు ఆయనపై కేంద్రీకృతమైంది. విరాళాల వ్యవహారంలో చోటుచేసుకున్న అవకతవకలపై అనిల్ మిశ్రాకు నోటీసు జారీ చేసిన SIT త్వరలో ఆయనను విచారించనుంది. దీంతో ట్రస్ట్లో ఆరోపణలు, ప్రత్యారోపణలు మరోసారి వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ట్రస్ట్ నుంచి చంపత్ రాయ్కు మద్దతు
ఈ పరిణామాల మధ్య ట్రస్ట్ కోశాధికారి గోవింద్ గిరి ఒక ఇంటర్వ్యూలో చంపత్ రాయ్కు మద్దతుగా మాట్లాడారు. ఆయనను నిజాయితీ గల వ్యక్తిగా అభివర్ణిస్తూ, నిర్లక్ష్యం జరిగి ఉండొచ్చేమో కానీ ఆయనను నేరస్థుడిగా పరిగణించలేమని వ్యాఖ్యానించారు. ట్రస్ట్ సమావేశంలో కూడా సభ్యులంతా రామ మందిరం నిర్మాణంలో చంపత్ రాయ్ చేసిన సేవలను ప్రశంసించినట్లు సమాచారం.
క్లీన్ చిట్ సంకేతాలతో ట్రస్ట్కు ఊరట
SIT ప్రాథమిక నివేదికలో చంపత్ రాయ్పై తీవ్రమైన అభియోగాలు నిర్ధారణ కాలేదనే సంకేతాలు రావడంతో ట్రస్ట్ వర్గాల్లో కొంత ఊరట కనిపిస్తోంది. అదేవిధంగా, ఆలయానికి భక్తులు సమర్పించిన నగలు, విలువైన కానుకల పూర్తి జాబితాను ట్రస్ట్ విడుదల చేయడం ద్వారా బహుమతుల దుర్వినియోగంపై వస్తున్న విమర్శలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేసింది.
ట్రస్ట్లో త్వరలో కీలక మార్పులు
ట్రస్ట్ పరిపాలనలో పలు మార్పులు చేపట్టేందుకు ముసాయిదా సిద్ధమైంది. త్వరలో కొత్త సీఈవోను నియమించేందుకు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఈ నెల 22న జరగనున్న తదుపరి సమావేశంలో ట్రస్ట్ పునర్వ్యవస్థీకరణతో పాటు కొత్త సీఈవో పేరును ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా కృష్ణ మోహన్ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించడం ద్వారా పరిపాలనలో స్థిరత్వం తీసుకురావాలని ట్రస్ట్ భావిస్తోంది.
దర్యాప్తు కొనసాగుతోంది
ఇదిలా ఉండగా, అనిల్ మిశ్రాను త్వరలో SIT విచారించనుంది. మరోవైపు, రిమాండ్లో ఉన్న నిందితుడిని అయోధ్య పోలీసులు నిరంతరం ప్రశ్నిస్తున్నారు. ఈ దర్యాప్తులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం చంపత్ రాయ్కు అనుకూలంగా పరిస్థితులు మారుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఈ వ్యవహారంలో తుది స్పష్టత మాత్రం SIT పూర్తి నివేదిక వెలువడిన తర్వాతే వచ్చే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Nothing Phone (4b): 6000mAh బ్యాటరీతో.. నథింగ్ ఫోన్ (4బి) భారత్లో విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Ayodhya Ram Mandir: రామ మందిర్ ట్రస్ట్లో కలకలం.. చంపత్ రాయ్ వ్యాఖ్యలతో మళ్లీ వేడెక్కిన వివాదం
-
Pawan Kalyan Fan: పవన్ ఇంటికొచ్చి పరామర్శించిన ఆ బాలుడు ఇకలేడు.. ‘నిరంజన్’ కన్నుమూత!
-
IND vs ENG: ఛేదనలో బొక్కబోర్ల పడ్డ భారత్.. ఇంగ్లండ్ భారీ విజయం.!
-
Tollywood : శాండిల్ వుడ్ మార్కెట్పై కన్నేసిన తెలుగు ప్రొడక్షన్ హౌసెస్
ట్రెండింగ్
-
Kitchen Tips : వేడి ఆలూ తొక్క.. 10 సెకన్లలో ఊడిపోతుంది.! ఈ ట్రిక్ తెలుసా.?
-
Kitchen Tips : కుక్కర్లో అన్నం ముద్ద అవుతుందా? ఈ ట్రిక్తో మల్లెపూవులా వస్తుంది!
-
టూరిస్టులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో 5 అద్భుత గమ్యస్థానాలు.! TSTDC అదిరిపోయే టూర్ ప్యాకేజీ.!
-
7,200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Vivo నుంచి కొత్త G5i, G5z స్మార్ట్ఫోన్లు లాంచ్..!
-
Black Jamun Jam: ప్రిజర్వేటివ్స్ అవసరం లేకుండానే.. 6 నెలలు నిల్వ ఉండే ‘నేరేడు జామ్’ ఇంట్లోనే చేయండి ఇలా.!