Mahua Moitra: పార్లమెంట్లో ప్రశ్నలు అడిగేందుకు లంచం, గిఫ్టులు తీసుకున్నారనే అభియోగాలను ఎదుర్కొంటున్నారు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా. వ్యాపారవేత్త హీరానందాని నుంచి డబ్బులు తీసుకున్నారని ఆమెపై ఆరోపణలను పార్లమెంట్ ఎథిక్స్ ప్యానెల్ విచారించింది. దీంతో పాటు ఆమె పార్లమెంట్ లాగిన్ వివరాలను ఇతరులకు ఇచ్చారని తేలింది. ఈ నేపథ్యంలో ఆమెను ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయాలని ప్యానెల్ సిఫారసు చేసింది.
ఇదిలా ఉంటే ఈ వ్యవహారంపై మొదటి నుంచి టీఎంసీ పార్టీ సైలెంట్గా ఉంటోంది. తొలిసారి మహువా మోయిత్రా వివాదంపై తృణమూల్ చీఫ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. లోక్సభ నుంచి మహువా మోయిత్రాను బహిష్కరిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆమె గెలుపు అవకాశలు పెరుగుతాయని అన్నారు. లోక్సభ నుంచి మోయిత్రాను తప్పించేందుకు ప్లాన్ ప్రకారమే ఇలా చేశారని ఆమె ఆరోపించారు. గురువారం కోల్కతాలో జరిగిన ఓ కార్యక్రమంలో దీదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Geert Wilders: “ప్రవక్త” వ్యాఖ్యలపై నుపూర్ శర్మకు మద్దతు ఇచ్చిన డచ్ లీడర్ భారీ విజయం..!
మహువా మోయిత్రా ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేసేందుకు అదానీ గ్రూపుపై ఉద్దేశపూర్వకంగా పార్లమెంట్లో ప్రశ్నలు అడిగారని, ఆమె అడిగిన 60 ప్రశ్నల్లో 51 ప్రశ్నలు అదానీ వ్యవహారం చుట్టే తిరిగాయని, ఇందుకు ఆమె దర్శన్ హీరానందానీ నుంచి రూ.2 కోట్ల నగదుతో పాటు లంచం తీసుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మహువా మోయిత్రా బెంగాల్లోని కృష్ణానగర్ ఎంపీగా ఉన్నారు.
ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మొదట లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు ఫిర్యాదు చేశారు. ఆమె లాగిన్ వివారాలపై ఎంక్వైరీ చేయాల్సింది కేంద్రం ఐటీ శాఖ మంత్రి అశ్విణి వైష్ణవ్కి కూడా లేఖ రాశారు. ఈ కేసులో వ్యాపారి దర్శన్ హీరానందానీ ఎథిక్స్ ప్యానెల్కి అఫిడవిట్ సమర్పించారు. మోయిత్రాకు డబ్బులు ఇచ్చినట్లు అందులో పేర్కొన్నాడు. అయితే ఆమె మాత్రం ఈ ఆరోపణల్ని ఖండించారు.