హ్యాకర్స్ అదును చూసి సోషల్ మీడియా ఖాతాలపై దాడులు చేస్తూనే ఉన్నారు.. ఇప్పటికే కేంద్రంలోని పలు శాఖలకు సంబంధించిన సోషల్ మీడియాల ఖాతాలను హ్యాక్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.. ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ.. మరికొందరు కేంద్ర మంత్రుల ఖాతాలు.. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వ ఖాతాలు, మంత్రుల ఖాతాలు హ్యాక్ అయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా, కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు సంబంధించిన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారు.. ఇవాళ సమాచార శాఖ ట్విట్టర్ ఖాతాను తమ చేతిలోకి తీసుకున్న హ్యాకర్లు.. ఖాతా పేరును ఎలెన్ మస్క్ అని పేరు మార్చారు. అంతేకాదు ప్రొఫైల్లో చేప ఫోటో పెట్టారు.. అదే సమయంలో కొన్ని ట్వీట్లు కూడా చేసి.. ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించారు.. అయితే కొద్ది సమయంలోనే ఈ పరిణామాన్ని గమణించిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్.. వెంటనే ఆ ఖాతాను రికవరీ చేసిందని ఐటీ మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం సమాచార శాఖ ట్విట్టర్ ఖాతా యథావిధిగా పనిచేస్తున్నట్టు ఐటీ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది.
Read Also: మైండ్ గేమ్ రాజకీయాలకు చెక్ పెడతాం-సోమువీర్రాజు