ఇండియాలో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతున్నది. గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి. తాజాగా దేశంలో 2,51,209 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో 627 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య నిన్నటి కంటే స్వల్పంగా పెరిగింది. అయితే,కోలుకున్న వారి సంఖ్య భారీగా పెరిగినట్టు ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది. 24 గంటల వ్యవధిలో 3,47,443 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్లో పేర్కొన్నది. దేశలో ప్రస్తుతం 21,05,611 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 15.88శాతంగా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 164,44,73,216 వ్యాక్సిన్ డోసులు అందించారు. మూడో వేవ్ కారణంగా ప్రికాషనరీ డోస్ను అందిస్తున్నారు. కరోనా మహమ్మారికి అందిస్తున్న కోవీషీల్డ్, కోవాగ్జిన్లు బహిరంగ మార్కెట్లో విక్రయించేందుకు షరతులతో కూడిన అనుమతులు కేంద్రం మంజూరు చేసిన సంగతి తెలిసిందే.