Tamil Nadu: కాంగ్రెస్ ద్రోహం చేసింది, విజయ్‌తో చేతులు కలిపేది లేదు: డీఎంకే.

  • తమిళనాడులో INDIA కూటమిలో విభేదాలు.
  • విజయ్ నేతృత్వంలోని TVKతో పొత్తును తిరస్కరించిన డీఎంకే.
  • కాంగ్రెస్ తమను రాజకీయంగా ద్రోహం చేసిందని డీఎంకే ఆరోపణ.
  • బీజేపీకి వ్యతిరేకంగా ఐక్యత కోరుతున్న కాంగ్రెస్, VCK.
Tamil Nadu

Tamil Nadu

Tamil Nadu: తమిళనాడు ఇండియా కూటమిలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. రాష్ట్ర స్థాయిలో రాజకీయాలు ఎలా ఉన్నా, జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవడానికి సహకరించుకోవాలని విజయ్ ప్రభుత్వంలో కీలక పార్టీగా ఉన్న వీసీకే పిలుపునిచ్చింది. ఈ ప్రతిపాదనకు కాంగ్రెస్ కూడా మద్దతు తెలిపింది. టీవీకేను ఇండియా కూటమిలోకి తీసుకురావాలని వీసీకే పిలుపును డీఎంకే వ్యతిరేకించింది. కేరళ,పశ్చిమ బెంగాల్ తరహా రాజకీయ విధానాన్ని అనుసరించాలని వీసీకే అధినేత తోల్ తిరుమావళవన్ ప్రతిపాదించడంపై డీఎంకే వ్యాఖ్యానిస్తూ, ఆ రాష్ట్రాల మోడల్ తమిళనాడులో నడవదని చెప్పింది.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, ఎన్నికల తర్వాత విజయ్‌తో చేతులు కలిపింది. తమను కాంగ్రెస్ ద్రోహం చేసిందని డీఎంకే ఆరోపిస్తూ.. రాష్ట్రంలో మారిన పరిస్థితుల్లో టీవీకేతో చేతులు కలిపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. డీఎంకే ఎంపీ గణపతి పి. రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ఎన్నికల తర్వాత కేవలం మంత్రి పదవుల కోసం టీవీకేతో కాంగ్రెస్ చేతులు కలిపి, డీఎంకేకు వెన్నుపోటు పొడిచిందని అన్నారు. ఇప్పుడు డీఎంకేను ఒప్పించడానికి వీకేసీని పావుగా వాడుకుంటోందని కాంగ్రెస్‌పై ఆరోపించారు. పార్లమెంట్లో ఒక్కసీటు కూడా లేని టీవీకేను కూటమిలో చేర్చాలా.? అనే దానిపై సీరియస్‌గా ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.

మరోవైపు, కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి మాత్రం బీజేపీని ఎదుర్కోవడానికి విస్తృత ప్రతిపక్ష ఐక్యత అవసరమని అభిప్రాయపడ్డారు. దేశ ప్రయోజనాల కోసం రాజకీయ విభేదాలను పక్కన పెట్టాలని సూచించారు. డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఎలంగోవన్ స్పందిస్తూ.. ముందుగా విజయ్‌ను ఒప్పంచండి, ఆయన డీఎంకేనూ తన ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా చెబుతున్నారని, అలాంటప్పుడు ఎలా కలిసి పనిచేస్తారు.? అని ప్రశ్నించారు.