Site icon NTV Telugu

Yogi Adityanath: ఇండియా కూటమి తమిళ సంస్కృతిని ద్వేషిస్తోంది.. ‘సెంగోల్’ వివాదంపై యోగి ఆదిత్యనాథ్

Yogi Adityanath

Yogi Adityanath

Yogi Adityanath: పార్లమెంట్ లో రాజదండం(సెంగోల్) ఉంచడంపై మళ్లీ దుమారం రేగుతోంది. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు ఆర్కే చౌదరి చేసిన వ్యాఖ్యలు దీనికి కారణం అయ్యాయి. పార్లమెంటు నుంచి రాజదండం తొలగించాలంటూ ఆయన రాసిన లేఖకు బీజేపీ బదులిచ్చింది. ఇదిలా ఉండగా.. దీనిపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనిపై మండిపడ్డారు. భారతీయ చరిత్రను, తమిళ సంస్కృతిని సమాజ్‌వాదీ పార్టీ, ఇండియా కూటమి అగౌరవపరుస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంటులో ‘సెంగోల్’ ఉనికి గురించి సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఆర్‌కె చౌదరి చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలతో రాజుకున్న రాజకీయ వివాదానికి ప్రతిస్పందనగా యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యలు వచ్చాయి. సమాజ్‌వాదీ పార్టీకి భారతీయ చరిత్ర లేదా సంస్కృతి పట్ల గౌరవం లేదని ఆయన మండిపడ్డారు. ‘సెంగోల్’పై వారి అగ్రనేతల వ్యాఖ్యలు ఖండించదగినవి, వారి అజ్ఞానాన్ని సూచిస్తాయని యోగి వ్యాఖ్యానించారు. ఇది ముఖ్యంగా తమిళ సంస్కృతిపై ఇండియా కూటమికి ఉన్న ద్వేషాన్ని కూడా చూపుతుందన్నారు. ‘సెంగోల్’ భారతదేశానికి గర్వకారణమని, ప్రధాని మోడీ దీనికి పార్లమెంటులో అత్యున్నత గౌరవం ఇవ్వడం గౌరవప్రదమైన విషయమని యోగి ఆదిత్యనాథ్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

Read Also: Bullet Trains: భారతదేశం అంతటా “బుల్లెట్ ట్రైన్స్”.. త్వరలో కేంద్రం అధ్యయనం..

ఆర్కే చౌదరి రాచరికానికి చిహ్నంగా పేర్కొన్న ‘సెంగోల్’ పార్లమెంట్‌లో ఏర్పాటు చేయడంలో సముచితతను ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. ఆర్కే చౌదరి సెంగోల్ ప్రజాస్వామ్య భారతదేశంలో రాచరికానికి సంబంధించిన అనాచార చిహ్నంగా పేర్కొన్నారు. రాచరికం అంతమై, దేశం విడిపోయిందని, అందుకే రాజదండం అవసరం లేదని, రాజ్యాంగాన్ని కాపాడాలని, రాజదండాన్ని తొలగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంతే కాదు, ఆ స్థలంలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ వివాదం రాజుకుంది. గత ఏడాది మే 28న, కొత్త పార్లమెంట్ భవనంలోని స్పీకర్ కుర్చీ పక్కన, లోక్‌సభ ఛాంబర్‌లో ప్రధాని మోడీ సెంగోల్‌ను ఏర్పాటు చేశారు. ఈ ‘సెంగోల్’ గతంలో ఆగష్టు 14, 1947 రాత్రి భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూచే ఆమోదించబడింది. ‘సెంగోల్’ సుమారు ఐదు అడుగుల పొడవు, విలువైన రాళ్లతో అలంకరించబడి, పైభాగంలో బంగారు గోళం ఉంది. దీని పేరు “సెమ్మై” అనే తమిళ పదం నుంచి వచ్చింది, దీని అర్థం ధర్మం.

సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్ ఆర్కే యాదవ్‌ను సమర్థించారు. ప్రజాస్వామ్య సూత్రాలను సమర్థించాలనే ప్రధాని నరేంద్ర మోడీకి గుర్తు చేసేలా ఆయన వ్యాఖ్యలు ఉద్దేశించబడ్డాయన్నారు. “సెంగోల్‌ను స్థాపించినప్పుడు, ప్రధానమంత్రి దాని ముందు వంగి నమస్కరించారు. ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆయన ఈ విషయాన్ని మరచిపోయి ఉండవచ్చు. బహుశా మా ఎంపీ చేసిన వ్యాఖ్య ఆయనకు దానిని గుర్తు చేయడమే” అని అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.

విపక్షాల తీరును బీజేపీ తీవ్రంగా ఖండించింది. “సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటులో ‘సెంగోల్’ని ‘రాజా కా దండ్’ అని పిలుస్తుంది. అలా అయితే, జవహర్‌లాల్ నెహ్రూ ఎందుకు అంగీకరించారు? ఇది వారి మనస్తత్వాన్ని తెలియజేస్తుంది. వారు రామచరిత్మానస్, ఇప్పుడు ‘సెంగోల్’పై దాడి చేస్తారు. ఈ అవమానానికి డీఎంకే మద్దతు ఇస్తుందా? ?వారు స్పష్టం చేయాలి’’ అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు.

Exit mobile version