India – Afghanistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత, భారత్ పాకిస్తాన్తో ‘‘సింధూ జలాల ఒప్పందాన్ని’’ నిలిపేసింది. పాకిస్తాన్కు ఈ నదీ జలాలు అత్యంత కీలకం. ఆ దేశ వ్యవసాయం సింధూ దాని ఉప నదులపైనే ఆధారపడి ఉంది. అయితే, ఇప్పుడు ఆఫ్ఘానిస్తాన్ కూడా భారత దారిలోనే నడుస్తోంది. ఆఫ్ఘాన్ నుంచి పాకిస్తాన్ లోకి ప్రవహించే నదులను నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ‘‘కునార్’’ నదిపై డ్యామ్ నిర్మించాలని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోంది.
ఇటీవల, ఆఫ్ఘాన్-పాకిస్తాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో తాలిబాన్ అధినేత హిబతుల్లా అఖుంద్జాదా కునార్ నదిపై వీలైనంత త్వరగా ఆనకట్ట నిర్మించాలని ఆదేశించారు. తాలిబాన్ మంత్రి అబ్దుల్ లతీఫ్ మన్సూర్ మాట్లాడుతూ.. అఖుంద్జాదా విదేశీ కంపెనీల కోసం వేచి చూడకుండా, ప్రాజెక్టును ప్రారంభించడానికి దేశీయ కంపెనీలో ఒప్పందాలు చేసుకోవాలని ఆదేశించినట్లు చెప్పారు.
Read Also: Namaz In Temple: ముస్లిం యువకుడి అరాచకం.. ఆలయంలో నమాజ్ చేసి అర్చకులకు బెదిరింపులు..!
అయితే, ఇప్పుడు డ్యామ్ నిర్మాణ విషయంలో ఆఫ్ఘానిస్తాన్కు భారత్ సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ విలేకరులతో మాట్లాడుతూ.. డ్యామ్ నిర్మాణానికి భారత మద్దతు ఉంటుందని తెలిపారు. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి పర్యటన సందర్భంగా విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో జలవిద్యుత్ ప్రాజెక్టులతో సహా స్థిరమైన నీటి నిర్వహణ కోసం ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్న అన్ని ప్రయత్నాలకు భారతదేశం మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ఆయన అన్నారు.
ఇప్పటికే, భారత్ ఆఫ్ఘనిస్తాన్లో పలు డ్యాములను నిర్మించింది. హెరాత్ ప్రావిన్సులో సల్మా ఆనకట్టను నిర్మించింది. ఈ విషయాన్ని కూడా జైస్వాల్ గుర్తు చేశారు. కునార్ నది కాబూల్ నదితో కలిసిన తర్వాత పాకిస్తాన్లోకి ప్రవేశిస్తుంది. దీనిని పాకిస్తాన్ లో చిత్రాల్ నదిగా పిలుస్తారు. ఆ తర్వాత ఇది సింధూ నదిలో కలిసి, అరేబియా సముద్రంలో కలుస్తుంది. కాబూల్ నదిలో ఎక్కువ నీరు పాకిస్తాన్కు చేరుతోంది. ముఖ్యంగా, పాక్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రాంతం ఈ నది జలాలతో లాభపడుతోంది.