Pakistan: ‘‘భారత్ మాపై దాడి చేస్తే, ప్రపంచం అంతం’’.. పాక్ రక్షణ మంత్రి వార్నింగ్..

  • ఉద్రిక్తతల మధ్య పాకిస్తాన్ రక్షణమంత్రి బెదిరింపులు..
  • భారత్ పాక్‌పై దాడి చేస్తే ప్రపంచం అంతం అవుతుందని హెచ్చరిక..
Khawaja Asif

Khawaja Asif

Pakistan: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ వణికిపోతోంది. భారత్ ప్రతీకారంగా ఎప్పుడు తమపై విరుచుకుపడుతుందో తెలియక దాయాది ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఈ ఆందోళన నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వంలోని కీలక నాయకులు ఏం మాట్లాడుతున్నారో వారికి కూడా అర్థం కావడం లేదు. ప్రభుత్వంలో మంత్రులు భారత్‌ని బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, భారత్ దాడి చేస్తే అణ్వాయుధాలతో దాడి చేస్తామని చెబుతున్నారు.

Read Also: Off The Record: మాజీ మంత్రి అనిత్ కుమార్ యాదవ్ వంతు వచ్చిందా..?

తాజాగా, పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మరింత ముందుకెళ్లి విచిత్రమైన వాదన చేశారు. ‘‘భారత్ పాకిస్తాన్‌పై దాడి చేయడానికి ధైర్యం చేస్తే, పాకిస్తాన్ ఉనికికి ముప్పు వాటిల్లితే ఈ ప్రపంచంలో ఎవరూ మనుగడ సాధించలేరు’’ అంటూ మరింతగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌కి ఏదైనా జరిగే మొత్తం ప్రపంచమే అంతం అవుతుందని, మేం బతికి ఉండాలి లేదంటే ఎవరూ బతకకూడదు అంటూ కామెంట్స్ చేశారు.

దీనికి ముందు, జమ్మూ కాశ్మీర్ వెంబడి నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి భారత్ ఎప్పుడైనా సైనిక దాడి చేయవచ్చని ఖ్వాజా ఆసిఫ్ హెచ్చరించారు. భారత్ దాడికి పాక్ ధీటైన సమాధానం ఇస్తుందని విలేకరుల సమావేశంలో అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడిపై అంతర్జాతీయ విచారణను పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కోరారు అని అన్నారు. భారత్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తమపై అనవసర, నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని ఆసిఫ్ చెప్పారు. వీటిలో పాటు సింధు జలాలపై భారత్ ఏ ప్రాజెక్టును, ఏ నిర్మాణాన్ని చేపట్టిన పాకిస్తాన్ వాటిని ధ్వంసం చేస్తుందని హెచ్చరించారు.