New CEC Gyanesh Kumar: ప్రస్తుతం ఎన్నికల కమిషనర్గా ఉన్న జ్ఞానేశ్ కుమార్.. భారత 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)గా ఎంపికయ్యారు. అతడి స్థానంలో ఎన్నికల కమిషనర్గా.. ప్రస్తుతం హర్యానా సీఎస్ గా విధులు నిర్వర్తిస్తున్న వివేక్ జోషి (1989 బ్యాచ్ ఐఏఎస్)ని నియమించారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ పదవీకాలం ఈరోజు (ఫిబ్రవరి 18) ముగియనుంది. ఈ నేపథ్యంలోనే తదుపరి సీఈసీని ఎంపిక చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ సోమవారం నాడు సమావేశం అయింది. ప్రధాని కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పాల్గొన్నారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రాం మేఘ్వాల్ నేతృత్వంలోని సెర్చ్ కమిటీ ప్రతిపాదించిన ఐదుగురు అభ్యర్థుల జాబితా నుంచి జ్ఞానేశ్ కుమార్ను సీఈసీగా మోడీ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసి తమ నిర్ణయాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపగా ఆమె ఆమోదం తెలిపింది.
Read Also: AlluArjun: అల్లు అర్జున్, అట్లీ మూవీలో హీరోయిన్ ఫిక్స్..?
అయితే, కేరళ క్యాడర్కు చెందిన 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి జ్ఞానేశ్ కుమార్.. గత ఏడాది మార్చిలో ఈసీగా బాధ్యతలు చేపట్టారు. 2019లో కేంద్ర ప్రభుత్వం అధికరణం 370 రద్దు కోసం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన బిల్లును రూపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. కేంద్ర హోంశాఖలో అప్పుడు సంయుక్త కార్యదర్శి (కశ్మీర్ డివిజన్)గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత సహకార శాఖ కార్యదర్శిగా 2024 జనవరిలో పదవీ విరమణ చేయగా.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సన్నిహిత సంబంధాలు ఉండటంతో.. ఎన్నికల కమిషనర్గా ఎంపికయ్యారు. సీఈసీగా జ్ఞానేశ్ 2029 జనవరి 26వ తేదీ వరకు పదవీలో కొనసాగుతారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ ఏడాది చివరిలో బీహార్, వచ్చే ఏడాదిలో తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి.