LPG: హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్కు ఊరట కలిగించే వార్త వచ్చింది.. సుమారు 94,000 టన్నుల ఎల్పీజీ గ్యాస్ను తీసుకువస్తున్న రెండు ట్యాంకర్లు రాబోయే 48 గంటల్లో ముంబై, మంగళూరు తీరాలకు చేరుకోనున్నాయి. బీడబ్ల్యూ టైర్, బీడబ్ల్యూ ఎల్మ్ అనే రెండు గ్యాస్ ట్యాంకర్లు ప్రస్తుతం హర్మూజ్ జలసంధిని దాటి భారత్ వైపు ప్రయాణిస్తున్నాయి. ఈ మార్గం ప్రపంచంలో అత్యంత కీలకమైన ఇంధన సరఫరా మార్గాలలో ఒకటి. ఇక్కడ జరిగే ప్రతి పరిణామం భారతదేశ ఇంధన భద్రతపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.
నౌకాదళం అప్రమత్తత
ప్రస్తుతం గల్ఫ్ ప్రాంతంలో భారత నౌకాదళం యుద్ధనౌకలను మోహరించింది. అవసరమైతే భారత నౌకలను రక్షించేందుకు సిద్ధంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్కు “ఆపరేషన్ ఊర్జా సురక్ష” అని పేరు పెట్టారు. దీని ప్రధాన లక్ష్యం అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య దేశానికి నిరంతర ఇంధన సరఫరా కొనసాగించడం. ఇప్పటికే నాలుగు నౌకలు సురక్షితంగా భారత్ చేరుకోగా, ప్రస్తుతం 18 భారతీయ నౌకలు ఇంకా హర్మూజ్ ప్రాంతంలో చిక్కుకుపోయి ఉన్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన సమయంలో అక్కడ మొత్తం 24 నౌకలు ఉన్నట్లు సమాచారం.
నావికుల పరిస్థితి
చిక్కుకుపోయిన నౌకల్లో సుమారు 500 మంది భారతీయ నావికులు ఉన్నారు. పరిమిత వనరులతో, వారు శాటిలైట్ కాల్స్ ద్వారా తమ కుటుంబాలతో మాట్లాడుతున్నారు. ముంబై, కొచ్చి, విశాఖపట్నంలోని వారి కుటుంబాలు వారు సురక్షితంగా తిరిగి రావాలని ఆశిస్తున్నాయి.
భారత్కు ఊరట
భారత్కు చేరుకోనున్న ఈ 94,000 టన్నుల LPG గ్యాస్ దేశీయ అవసరాలను సుమారు మూడు రోజుల పాటు తీర్చగలదని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం LPG కొరత సమస్య ఎదుర్కొంటున్న సమయంలో ఇది ప్రజలకు కొంత ఉపశమనం కలిగించనుంది.