Ahmedabad airport: పలు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలతో వరదలు ముంచెత్తుతున్నాయి. వరదల నీరు ఇళ్లకు చేరడంతో ప్రజలు ఇళ్లల్లో ఉండలేని పరిస్థితి. ఇక వరద నీరు బస్టాండ్లు, రైల్వే స్టేషన్లకు చేరాయి. ఇపుడు విమానాశ్రయాలకు చేరాయి. దీంతో విమానాలను సైతం రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుంది. గుజరాత్లో గత కొన్ని రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దాంతో రాష్ట్రంలోని పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. అహ్మదాబాద్ ఎయిర్పోర్టులోకి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టెర్మినల్ ఏరియాలతోపాటు రన్వే పైకి కూడా వరద నీరు వచ్చి చేరింది. దీంతో కొన్ని విమానాలను రద్దు చేయాల్సి వస్తుందేమోనని అధికారులు అంచనా వేస్తున్నారు.
Read also: Nehru ZooPark: తగ్గేదేలే.. పుష్ప సినిమా స్టైల్ లో జూపార్క్ లో గందపు చెట్లు స్మగ్లింగ్
విమానాశ్రయంలో మోకాళ్ల లోతు నీళ్లలో ప్రయాణికులు అటూ ఇటూ నడవాల్సి వస్తున్నది. అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరద పరిస్థితిపై నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ ఎయిర్పోర్టులో విమానాలు ఎగరడం కష్టమని, పడవలు సులభంగా పరుగులు తీస్తాయని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఇదిలావుంటే ఎయిర్పోర్టులోంచి వరద నీటిని తొలగించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. గత 28 ఏళ్లలో అహ్మదాబాద్ ఎయిర్పోర్టుకు వరదలు రావడం ఇదే తొలిసారని వారు తెలిపారు. గత 48 గంటల నుంచి గుజరాత్లో ఎడతెరపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. దాంతో పలు ప్రాంతాల్లో వరదలు పోటెత్తుతున్నాయి.