దేశంలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. గత నెల కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో అరుదైన ఫీవర్ కేసు బయటపడింది. తీర్థహళ్లి మండలంలో ఓ మహిళకు(57) మంకీ ఫీవర్ నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు. అయితే ఇప్పుడు తాజాగా కేరళలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. కేరళ వయనాడ్ జిల్లాలోని పనవళ్లీ గిరిజన ప్రాంతంలో 24 ఏళ్ల యువకుడికి ఈ జ్వరం సోకింది. తీవ్ర జ్వరంతో ఆస్పత్రిలో చేరిన ఆ యువకుడికి మంకీ ఫీవర్ లక్షణాలు ఉండగా.. వైద్య పరీక్షలు చేశారు. వారు అనుకున్నదే నిజమైంది.
మనంతవాడీ వైద్య కళాశాలలో బాధితుడికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఏడాది కేరళలో మంకీ ఫీవర్ కేసు నమోదవడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అయితే రెండేళ్ల క్రితం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర్ మండలం అరళగోడు గ్రామంలో మంకీ ఫీవర్తో 26 మంది మరణించారు. ఆ తర్వాత ఇలాంటి కేసులు వెలుగులోకి రాలేదు.