NEET Fake OMR: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్)లో తనకు మంచి ర్యాంక్ వచ్చిందని పేర్కొంటూ నకిలీ ఓఎంఆర్ను దాఖలు చేసిన విద్యార్థినిపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నకిలీ ఓఎంఆర్ దాఖలు చేసినందుకు రూ. 20వేలు జరిమానా విధించింది. నీట్ యూజీ-2023లో మెడికల్ అభ్యర్థి దాఖలు చేసిన OMR షీట్ను తారుమారు చేసే ప్రయత్నంపై ఢిల్లీ హైకోర్టు మహిళా అభ్యర్థికి రూ. 20,000 జరిమానా విధించింది. ఓఎంఆర్ షీట్ను తారుమారు చేసేందుకు పిటిషనర్ ఉద్దేశ్యపూర్వకంగా ప్రయత్నిస్తున్నారని కోర్టు పేర్కొంది. కోర్టులో ఇలాంటి ప్రయత్నాన్ని సహించలేమని స్పష్టం చేసింది. మహిళా అభ్యర్థికి రూ.రెండు లక్షల జరిమానా విధిస్తూ పోలీసులకు అప్పగించే అవకాశం ఉన్నప్పటికీ.. ఆమె వయస్సు దృష్ట్యా అలా చేయడం మానుకున్నామని జస్టిస్ పురుషేంద్ర కుమార్ కౌరవ్ బెంచ్ పేర్కొంది.
Read Also: UP Tractor Accident: కాల్వలో పడిపోయిన ట్రాక్టర్.. నలుగురు చిన్నారులతో సహా 9 మంది మృతి
కేసు విచారణ సందర్భంగా తాను సమర్పించిన ఓఎంఆర్ షీట్ అసలైనదని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కోర్టుకు చూపిన ఓఎంఆర్ షీట్ అసలైనది కాదని పట్టుబట్టిన పిటిషనర్ వైఖరి పట్ల దిగ్భ్రాంతి కలుగుతోందని కోర్టు పేర్కొంది. అధికారులు రూపొందించిన రికార్డు అధికారిక రికార్డు అని, దాని వాస్తవికతను అనుమానించాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. ఎన్టీఏకు వ్యక్తిగత వాటా లేనందున అభ్యర్థి సాధించిన మార్కులను మారుస్తుందని నమ్మడానికి ఎటువంటి కారణం లేదని ధర్మాసనం పేర్కొంది. పిటిషనర్ ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ను సమర్పించిన సందర్భంగా ఎన్టీఏ తరపు న్యాయవాది పిటిషనర్ చూపిన ఓఎంఆర్ షీట్ను తారుమారు చేసి, సవరించారని కోర్టుకు తెలిపారు. పరీక్షలో ఇచ్చిన సమాధానాలను ఉద్దేశపూర్వకంగా మార్చేశారు. మెరిట్ లిస్ట్లో తన పేరు అంతకుముందు కనిపించినప్పటికీ తర్వాత తొలగించబడిందన్న పిటిషనర్ వాదనను కూడా న్యాయస్థానం తిరస్కరించింది. పిటిషనర్ మరియు వారి తరపు న్యాయవాది ఒరిజినల్ ఓఎంఆర్ షీట్ చూసిన తర్వాత అది ఒరిజినల్ డాక్యుమెంట్ కాదని కోర్టుకు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ మెడికల్ అభ్యర్థి పిటిషన్పై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. కేరళలోని ఏదైనా ప్రభుత్వ వైద్య కళాశాలలో లేదా ఆంధ్రప్రదేశ్లో తనకు MBBS సీటును కేటాయించాలని అభ్యర్థించారు. తన మార్కులను మళ్లీ లెక్కించి, తాజా ఫలితాలు మరియు మెరిట్ జాబితా మరియు NEET (UG)-2023ని ప్రచురించాలని పిటిషనర్ ఎన్టీఏని కోరారు. జూన్ 13న NTA ఫలితాలను ప్రకటించిందని, కౌన్సెలింగ్లో తన ఆల్ ఇండియా ర్యాంక్ 351గా చూపబడిందని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. మొత్తం 720 మార్కులకు గాను 697 మార్కులు వచ్చాయని తెలిపారు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) వెబ్సైట్లో ఆమె తదుపరి దశ నమోదుకు వెళ్లలేకపోయిందని పిటిషన్లో పేర్కొంది. తన మొత్తం మార్కులు 103కి పడిపోయాయని, ర్యాంక్ 351 నుంచి తగ్గి 12,530,32 పడిపోయిందని పిటిషనర్ తన ఫిర్యాదులో తెలిపారు.