రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాలకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఉమ్మడి అభ్యర్థిని నియమించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నప్పటికీ.. అడుగు కూడా ముందుకు పడటం లేదు. విపక్షాలు అనుకుంటున్న అభ్యర్థులు క్రమంగా తాము పోటీలో ఉండబోవడం లేదని చెబుతున్నారు. గతంలో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఎన్సీపీ నేత, సీనియర్ రాజకీయ నాయకుడు శరద్ పవార్ ను అనుకున్నప్పటికీ.. ఆయన నేను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని చెప్పారు. దీంతో విపక్షాలు మరికొన్ని పేర్లను తెరపైకి తీసుకువచ్చాయి.
తాజాగా శరద్ పవార్ దారిలోనే నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా కూడా నడుస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల అభ్యర్థిగా తాను ఉండటానికి నిరాకరించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇటీవల ఢిల్లీలో ప్రతిపక్షాల సమావేశాన్ని నిర్వహించింది. అయితే ఇందులో ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిని ఎన్నికల్లో నిలబెట్టాలని అంతా అనుకున్నారు. అయితే ఫరూఖ్ అబ్దుల్లా పేరు వినిపించింది. కాగా తాను ఈ పోటీలో లేనిని చెప్పడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. భారత రాష్ట్రపతిగా ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా పరిగణించకుండా తన పేరును ఉపసంహరించుకుంటున్నానని.. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ పరిస్థితి క్లిష్టంగా ఉందని.. ఈ అనిశ్చిత సమాయాల్లో కాశ్మీర్ కు నా ప్రయత్నాలు అవసరం అని ఫరూఖ్ అబ్దుల్లా అన్నారు. పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీ పేరు విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రముఖంగా వినిపిస్తోంది.
అయితే ఇప్పటి వరకు ప్రతిపక్షాలు ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిర్ణయించడంలో విఫలం అయ్యాయి. ఇదిలావుండగా, రాష్ట్రపతి ఎన్నికలకు ఏకాభిప్రాయ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు ప్రతిపక్ష పార్టీల నేతలు జూన్ 20-21 తేదీల్లో సమావేశం కానున్నారు. ముంబైలో శరద్ పవార్ ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి సమావేశానికి టీడీపీ, వైసీపీ, బిజూజనతా దళ్, టీఆర్ఎస్, ఆప్ వంటి పార్టీలు హాజరుకాలేదు. కాంగ్రెస్ తో వేదిక పంచుకునేందకు ఆప్, టీఆర్ఎస్ సిద్ధంగా లేవు.