Aaradhya Bachchan: అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ ఢిల్లీ హైకోర్టుని ఆశ్రయించారు. అనేక వెబ్సైట్లలో తన ఆరోగ్యం గురించి నకిలీ, తప్పుదారి పట్టించే సమాచారాన్ని తొలగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అంతకుముందు పిటిషన్లో ఆమెకు సంబంధించిన కంటెంట్ని తొలగించాలంటూ సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్, ఎంటర్టైన్మెంట్ సోషల్ మీడియా అకౌంట్ బాలీవుడ్ టైమ్స్, ఇతర వెబ్సైట్లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. అయితే, దీనికి కొనసాగింపుగా ఆరాధ్య కొత్త పిటిషన్ దాఖలు చేశారు.
అమితాబ్ బచ్చన్ 13 ఏళ్ల మనవరాలు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఈ రోజు విచారణ సందర్భంగా గూగుల్కి నోటీసులు జారీ చేసింది. యూట్యూబ్లో నకిలీ, తప్పుదారి పట్టించే వీడియోల్లో తాను తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు చూపించాయని ఆరాధ్య బచ్చన్ పిటిషన్ దాఖలు చేసిన తర్వాత, ఆమె ఆరోగ్యం గురించి నకిలీ వీడియోలను వెంటనే తొలగించాలని హైకోర్టు 2023 ఏప్రిల్ 20న యూట్యూబ్ని ఆదేశించింది. కొన్ని వీడియోల్లో తాను మరణించినట్లు పేర్కొన్నాయని ఆరాధ్య గత పిటిషన్లో పేర్కొన్నారు.
సెలబ్రిటీ అయినా, మానసిక ఆరోగ్యం విషయానికి వస్తే ప్రతీ వ్యక్తి గౌరవం పొందే హక్కు ఉందని కోర్టు పేర్కొంది. కొన్ని వెబ్సైట్లు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ హైకోర్టు ఆదేశాన్ని పాటించకపోవడంతో ఆరాధ్య రెండో సారి పిటిషన్ దాఖలు చేశారు. ఈ విషయంపై మార్చి 17న తదుపరి విచారణ ఉండనుంది.