Emmanuel Macron: ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మక్రాన్ భారత్ పర్యటనలో ఉన్నారు. ఢిల్లీలో జరుగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఆయన పాల్గొన్నారు. గురువారం మక్రాన్ భారత్తో 114 రాఫెల్ జెట్ల కొనుగోలు ఒప్పందాన్ని సమర్థించారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించారు. రాఫెల్ యుద్ధవిమానాలు భారత్ను బలమైన సైనిక శక్తిగా మారుస్తాయని, ఇది రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంచుతాయని అన్నారు. ఈ ఒప్పందం భారత్లో మరిన్ని ఉద్యోగాలను సృష్టిస్తుందని కూడా చెప్పారు.
Read Also: Priyanka Gandhi: ‘‘ప్రధాని అవుతావు’’.. ప్రియాంకా గాంధీకి బాబా ఆశీర్వాదం..
‘‘ప్రజలు దీనిని ఎందుకు విమర్శిస్తారో నాకు అర్థం కావడం లేదు. ఇది మీ దేశాన్ని బలోపేతం చేస్తుంది’’ అని అన్నారు. 114 రాఫెల్ యుద్ధ విమానాల డీల్ను మక్రాన్ సమర్థించారు. ఒప్పందంపై వస్తున్న విమర్శలను తోసిపుచ్చారు. ఈ ఒప్పందంలోని వాణిజ్య అంశం రాఫెల్ను తయారు చేసే డస్సాల్ట్ ఏవియేషన్, భారత ప్రభుత్వం మధ్య జరిగే సంభాషనల్లో భాగమని మక్రాన్ అన్నారు.
రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని డిఫెన్స్ అక్విజేషన్ కౌన్సిల్(డీఏసీ) 114 రాఫెల్ జెట్ల కొనుగోలుకు ఆమోదం తెలిపిన వారం రోజులకే మక్రాన్ ఈ ప్రకటన చేశారు. దాదాపుగా ఈ ఒప్పందం విలువ రూ.3.25 లక్షల కోట్ల విలువైనది. భారత్-ఫ్రాన్స్ రక్షణ బంధం గురించి మక్రాన్ మాట్లాడుతూ.. వీలైన ఎక్కువ భాగాలు భారత్లో తయారు చేయడానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు.
