G20 Summit: ప్రపంచం ఆశ్చర్యపోయేలా భారతదేశం జీ20 సదస్పును నిర్వహించింది. బైడెన్, రిషి సునాక్, మక్రాన్ వంటి దేశాధినేతలు న్యూఢిల్లీకి వచ్చారు. ఈ సమావేశాల్లో భారత్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రపంచ దేశాధినేతలకు మరిచిపోలేని విధంగా ఆతిథ్యం ఇచ్చింది. ఇదిలా ఉంటే చైనా అధికారులు మాత్రం ఓవర్ యాక్షన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. చైనా డేలిగేట్స్ బ్యాగులను చెక్ చేసేందుకు అనుమతి ఇవ్వలేదని తెలుస్తోంది.
గత వారం జీ20 సమ్మిట్ కోసం చైనా ప్రతినిధి బృందం వచ్చింది. ఢిల్లీలోని ఓ స్టార్ హోటల్ లో వీరికి బస ఏర్పాటు చేశారు. అయితే హోటల్ లో వీరి బ్యాగులను భద్రతా సిబ్బంది తనిఖీ చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ చాణక్యపురిలో ఉన్న తాజ్ ప్యాలెస్ హోటల్ లో చైనా ప్రతినిధి బృందం బస చేసింది. ఈ ప్రతినిధి బృందం హోటల్ కి ఓ బ్యాగును తీసుసువచ్చింది. ఈ బ్యాగును తనిఖీ చేసేందుకు భద్రతా సిబ్బంది కోరగా.. ఇందుకు వారు నిరాకరించారని పోలీసులు తెలిపారు. భద్రతా నియమావళి ప్రకారం బ్యాగ్ను తనిఖీ చేయాలని పోలీసులు పదేపదే పట్టుబట్టినప్పటికీ చైనా ప్రతినిధులు చలించకపోవడంతో గందరగోళం చెలరేగింది.
Read Also: Live-In Relation: లివ్-ఇన్ రిలేషన్లో మరో హత్య.. నిందితుడికి సాయం చేసిన భార్య..
చివరకు ప్రతినిధి బృందం బ్యాగ్ ని తనిఖీ చేయకుండానే చైనా రాయబార కార్యాలయానికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు తెలిపారు. బ్యాగులో ఏముందనే వివరాలు తెలియరాలేదు. ఈ పరిణామం తరువాత మరికొంత మంది చైనా ప్రతినిధులు హోటల్ చేరుకున్నారని, ఆ సమయంలో వారి బ్యాగులు చెక్ చేసేందుకు అభ్యంతరం తెలపలేదని పోలీసులు వెల్లడించారు.
న్యూఢిల్లీలో జరిగిన జీ20 సమావేశానికి సభ్యదేశాలతో పాటు ఆహ్వానిత దేశాల అధినేతలు వచ్చారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ హాజరుకాలేదు. జిన్ పింగ్ స్థానంలో ఆ దేశ ప్రీమియర్ లీ కియాంగ్ హాజరవ్వగా.. పుతిన్ స్థానంలో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ సమావేశానికి హాజరయ్యారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధ నేపథ్యంలో పుతిన్ దేశాన్ని విడవడం లేదు. ఏ సమావేశానికైనా సెర్గీ లావ్రోవ్ హాజరవుతున్నారు. అయితే చైనా అధ్యక్షుడు రాకపోవడానికి మాత్రం స్పష్టమైన కారణాలు తెలియరాలేదు.