సోనమ్ రఘువంశీ గురించి యూపీలోని ధాబా యజమాని సాహిల్ యదవ్ కీలక విషయాలు వెల్లడించాడు. ఆదివారం అర్ధరాత్రి 1 ఒంటి గంట సమయంలో సోనమ్ ధాబాకు వచ్చినట్లు తెలిపాడు. ధాబాలో ఒంటరిగా కూర్చుని.. ఏడుస్తూ కనిపించిందని పేర్కొన్నాడు. ఇంటికి ఫోన్ చేయాలని అడిగితే.. వెంటనే తన ఫోన్ ఇచ్చినట్లు చెప్పాడు. ఫోన్లో కుటుంబ సభ్యులతో మాట్లాడిందని.. తర్వాత ఆమెను కూర్చోమని చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపాడు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రాథమిక చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారన్నారు. ఆమె భద్రత కోసం ఘాజీపూర్లోని వన్ స్టాప్ సెంటర్కు తరలించారన్నారు. ఇక సోమవారం ఉదయం సర్కిల్ అధికారి అమెను ప్రశ్నించడానికి వచ్చినప్పుడు మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయినట్లు తెలుస్తోంది. ఇక ఘాజీపూర్ చేరుకున్న మేఘాలయ పోలీసులకు సోనమ్ను అప్పగించినట్లు పోలీసులు ధృవీకరించారు.
అయితే రాజా రఘువంశీ హత్య కేసులో మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు సమాచారం. నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Pak Spy Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు.. ఎప్పటి వరకంటే..?
అయితే సోనమ్.. ఉత్తరప్రదేశ్లోని ఘాజీపూర్ జిల్లాలోని నందగంజ్ పోలీస్ స్టేషన్లో స్వయంగా లొంగిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. పోలీస్ వర్గాల సమాచారం ప్రకారం.. సోనమ్.. రాజ్ కుష్వాహా అనే వ్యక్తితో ప్రేమలో ఉన్నట్లుగా గుర్తించారు. అతనితో కలిసి భర్తను చంపేందుకు కుట్ర పన్నిందని పోలీసులు ఆరోపించారు. ప్రస్తుతం రాజ్ కుష్వాహా పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. హనీమూన్ ముసుగులో భర్తను చంపేందుకు ప్లాన్ చేసిందని గుర్తించారు. అయితే హనీమూన్కు వచ్చేటప్పుడే కాంట్రాక్ట్ కిల్లర్లను మధ్యప్రదేశ్ నుంచి తీసుకొచ్చినట్లుగా పోలీసులు తెలిపారు. జంట చివరిసారిగా ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులతో కనిపించారని ఒక టూరిస్ట్ గైడ్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ కుట్రను ఛేదించారు. ప్రస్తుతం సోనమ్.. ముగ్గురు హంతకులను అరెస్ట్ చేయగా.. సోనమ్ ప్రియుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Bhuma Akhila Priya: స్పృహ కోల్పోయిన ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ.. ఆసుపత్రికి తరలింపు..!
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్కు మే 11న వివాహం జరిగింది. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. అయితే తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో జంట విహరించారు. ఒక స్కూటీ అద్దెకు తీసుకుని ప్రయాణించింది. అలా కొండ ప్రాంతాల్లో పర్యటించారు. అయితే మే 23 నుంచి జంట హఠాత్తుగా అదృశ్యమైంది. కుటుంబ సభ్యులు ఫోన్ చేస్తే స్పందన లేదు. దీంతో కంగారు పడి మేఘాలయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహాన్ని కొండల్లో గుర్తించి పైకి తీశారు. బాడీని చూసి హత్యకు పరిగణించారు. అయితే సోనమ్ ఆచూకీ మాత్రం లభించలేదు. ఆమె కూడా హత్యకు గురైందేమోనని కొండల్లో జల్లెడ పట్టారు. ఆమెకు సంబంధించిన రెయిన్ కోట్ లభించింది. దానిపై రక్తపుమరకలు కనిపించడంతో ఆమె కూడా హత్యకు గురై ఉంటుందని అంతా భావించారు. కానీ పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యే సంఘటన ఎదురైంది. యూపీలో సోనమ్ ప్రత్యక్షం కావడంతో దాదాపు 16 రోజుల సస్పెన్స్కు తెరపడింది.
తండ్రి ఖండన
భర్త రాజా రఘువంశీని సోనమ్ చంపినట్లు వస్తున్న వార్తలను ఆమె తండ్రి తీవ్రంగా ఖండించారు. మేఘాలయ పోలీసులు కట్టు కథలు సృష్టిస్తోందని.. ఈ విషయంలో సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె సోనమ్కు ఏ పాపం తెలియదని తండ్రి దేవి సింగ్ మీడియాతో వాపోయాడు. తన కుమార్తె నిర్దోషి అని, ఆమెను పూర్తిగా నమ్ముతున్నట్లు చెప్పారు. భర్తను చంపే దుర్మా్ర్గురాలు కాదన్నారు. రెండు కుటుంబాల సమ్మతితోనే ఇద్దరికి వివాహం జరిపించినట్లు తెలిపారు. మేఘాలయ ప్రభుత్వమే అబద్ధాలు చెబుతోందని ఆయన అన్నారు. సోనమ్తో ఇంకా మాట్లాడలేదని.. అయినా ఆమె భర్తను ఎందుకు చంపుతుందని ప్రశ్నించారు. కేవలం పోలీసులే కట్టుకథలు అల్లుతున్నారన్నారు. సీబీఐ దర్యాప్తు చేయాలని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్, హోంమంత్రి అమిత్ షాలను సంప్రదిస్తామని పేర్కొన్నారు. విచారణ జరిగితే మేఘాలయ పోలీసులు జైలుకు వెళ్లాల్సి వస్తోందని చెప్పారు.