మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది.. గౌహతి నుంచే రెబల్ ఎమ్మెల్యేలు రాజకీయం నడుపుతున్నారు.. మరోవైపు అధికారం ఛేజారకుండా ఎత్తుకు పై ఎత్తులు వేసే ప్లాన్లో ఉద్దశ్ థాక్రే శిబిరం ఉంది.. వారికి సీనియర్ పొలిటీషియన్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సలహాలు ఇస్తున్నారట.. మరోవైపు అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దని చూస్తోన్న భారతీయ జనతా పార్టీ.. రెబల్ ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేల సహకారంతో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది.. దీని కోసం ఢిల్లీ నుంచి పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు.. అందులో భాగంగా మహారాష్ట్రలో కీలక నేత అయిన మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్కు బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.. దీంతో, హుటాహుటిన హస్తినబాట పట్టారు ఫడ్నవీస్.. బీజేపీ పెద్దలతో భేటీకానున్న ఆయన.. మహారాష్ట్రలో తాజా పరిణామాలపై చర్చించే అవకాశం ఉంది.. ఎలా అయితే, అధికారంలోకి వస్తాం..? ఇంకా ఎలా ముందుకు వెళ్లాలి..? రెబల్ ఎమ్మెల్యేలను నమ్ముకుని రాజకీయం చేయొచ్చా..? అనే అన్ని కోణాల్లో చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది..
Read Also: Hyderabad Party: మితిమీరుతున్న పార్టీలు.. దీనికి ఆర్గనైజర్ మహిళే!
ఢిల్లీ వెళ్లిన దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీకానున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు, గవర్నర్ చుట్టూరా రాజకీయం తిప్పాలనే ఆలోచనలో ఉన్నాయి బీజేపీ, ఏక్నాథ్ షిండే వర్గం. బలనిరూపణకు సిద్ధం కావాలని బీజేపీ, షిండే వర్గం భావిస్తుండగా.. ఆరోపణలు వెల్లువెత్తడంతో గవర్నర్ భగత్సింగ్ కొష్యారీ ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. ఇక, శివ సేన నుంచి బయటకు వచ్చిన తమకు 51 మంది ఎమ్మెల్యేల బలం ఉందని, బలనిరూపణకు అవకాశం ఇస్తేనే.. ముంబై తిరిగి వస్తామని శివసేన రెబల్ ఎమ్మెల్యేలు కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.. ఇదిలా ఉంటే.. మహారాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ భగత్సింగ్ కొష్యారి లేఖ రాశారు. ఈ మధ్య విడుదల చేసిన నిధులు, జీవోలపై వివరాలు అందజేయాలని లేఖలో కోరారు.