NTV Telugu Site icon

Haryana: హర్యానా బీజేపీలో అలకలు.. టికెట్ల నిరాకరణతో నేతల కంటతడి

Haryana

Haryana

హర్యానా బీజేపీలో అభ్యర్థుల ప్రకటన తర్వాత తీవ్ర అసంతృప్తి జ్వాలలు రేకెత్తించింది. పలువురు సీనియర్ నాయకులకు, మాజీ మంత్రులకు, మాజీ ఎమ్మెల్యేలకు అధిష్టానం టికెట్లు నిరాకరించింది. దీంతో నేతలు తీవ్ర అసంతృప్తి రగిలిపోతున్నారు. కార్యకర్తలు, శ్రేయోభిలాషులతో సమావేశం అయి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ స్వయంగా రంగంలోకి దిగి బుజ్జగింపులు చేస్తు్న్నారు. అయితే నాయకుల మాత్రం.. ముఖ్యమంత్రికి కనీసం షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు కూడా నిరాకరిస్తున్నారు. కోపంతో రగిలిపోతున్నట్లుగా నాయకుల ముఖాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హర్యానా ఓబీసీ మోర్చా నాయకుడు, మాజీ మంత్రి కరణ్ దేవ్ కాంబోజ్‌కి ఈసారి టికెట్ లభించలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన్ను బుజ్జగించేందుకు మాజీ మంత్రి ఇంటికి సీఎం సైనీ వెళ్లారు. కానీ సైనీకి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు నిరాకరించారు. అనంతరం ముఖ్యమంత్రి కుర్చీ పక్కనే కూర్చున్న.. కనీసం ఆయన ముఖాన్ని కూడా చూసేందుకు ఇష్టపడలేదు. రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టుకుంటూ వచ్చిన మాజీ మంత్రి.. ముఖ్యమంత్రి షేక్ హ్యాండ్ ఇవ్వగా.. చేతులు వెనక్కి లాక్కు్న్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే కాంబోజ్.. రాష్ట్ర బీజేపీ ఓబీసీ మోర్చా చీఫ్‌ పదవికి కూడా రాజీనామా చేశారు.

బీజేపీకి విధేయులు అవసరం లేదనుకుంటా? అని కరణ్ దేవ్ కాంబోజ్‌ వ్యాఖ్యానించారు. సంవత్సరాలుగా సేవ చేసిన వారిని బీజేపీ విస్మరించిందన్నారు. ఒక రోజు ముందు పార్టీ మారిన వారికి టికెట్లు ఇచ్చారని కాంబోజ్ ఆరోపించారు. మరో వీడియోలో జాబితాలో పేరులేనందుకు సోనిపట్‌లో తన మద్దతుదారులతో జరిగిన సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకురాలు కవితా జైన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఐదేళ్లుగా పార్టీ కోసం పని చేసినట్లు తెలిపారు. కనీసం హాస్టల్‌లో ఉన్న కూతురిని కూడా చూడలేదని.. అంతగా పార్టీ కోసం కష్టపడినట్లు వివరించారు.

మరో బీజేపీ ఎమ్మెల్యే శశి రంజన్ పర్మార్‌కు కూడా బీజేపీ టికెట్ నిరాకరించింది. దీంతో ఆయన కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. తనకు టికెట్ వస్తుందని ఆశించానని.. తీరా చూస్తే తనకు టికెట్ రాలేదని వాపోయారు. తన పేరు పరిశీలనలో ఉందని తన నియోజకవర్గ ప్రజలకు చెప్పానన్నారు. కానీ తీరా చూస్తే టికెట్ దక్కలేదని రంజన్ కంటతడి పెట్టారు.

హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇటీవలే కమలం పార్టీ 67 స్థానాలకు తొలి జాబితాను ప్రకటించింది. ఇంకా 23 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అక్టోబర్ 5న పోలింగ్, అక్టోబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి.