Covishield: కోవిడ్-19 మహమ్మారి నుంచి కోలుకున్న కొందరు అకాస్మత్తుగా మరణించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిపై అధ్యయనం చేసిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లు, వ్యాక్సిన్ల వల్ల మరణాలు సంభవించలేదని తేల్చారు. మరణాలకు జీవనశైలి, అప్పటికే ఉన్న కొన్ని ఆరోగ్య పరిస్థితులు కారణమని చెప్పింది. అయితే, కరోనా సమయంలో టీకాను అభివృద్ధి చేసిన ‘‘కోవిషీల్డ్’’ కంపెనీ కూడా ఈ నివేదికను హైలెట్ చేసింది.
Read Also: F-35B Fighter: కేరళలో చిక్కుకున్న ఎఫ్-35ని భారీ విమానంలో తరలించే అవకాశం..
తమ టీకాలు సురక్షితమైనవని, గుండెపోటు మరణాలతో సంబంధం లేదని కోవిషీల్డ్ను తయారు చేసిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఎక్స్ వేదికగా ‘‘సీరం ఇన్స్టిట్యూట్ టీకాలు సురక్షితమైనవి, శాస్త్రీయంగా ధృవీకరించబడ్డాయి’’ అని చెప్పింది. కోవిడ్ సమయంలో దేశవ్యాప్తంగా కోట్ల మందికి ఈ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందించింది.
ICMR, AIIMS నేతృత్వంలో జరిగిన విస్తృతమైన అధ్యయనాల నేపథ్యంలో ఈ ప్రకటన వచ్చింది. పెద్దల ఆకస్మిక మరణాల్లో జీవనశైలి, ముందుగా ఉన్న ఆరోగ్య పరిస్థితులు, కోవిడ్ అనంతర సమస్యలు కారణాలుగా ఉన్నట్లు చెప్పింది. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కోవిడ్ వ్యాక్సిన్లకు రాష్ట్రంలో ఇటీవల గుండె సంబంధిత మరణాలకు మధ్య సంబంధం ఉందని సూచించిన తర్వాత కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా ఒక వివరణ జారీ చేసింది. సమగ్ర అధ్యయనాల తర్వాత వ్యాక్సిన్లకు మరణాలకు సంబంధం లేదని చెప్పింది. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా కొవిషీల్డ్, కోవాగ్జిన్ టీకాలను ఇచ్చారు.