ఓ.. పుస్తకం పార్లమెంట్ను స్తంభింపజేసింది. అధికార-ప్రతిపక్షాల మధ్య రగడ రాజేసింది. గంటల తరబడి సభ గందరగోళంగా మారింది. ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ ప్రస్తావించిన పుస్తకంలో అసలు ఏముంది? ఎందుకు కేంద్రం అడ్డుపడింది. ఈ వివరాలు తెలియాలంటే ఈ వార్త చదవాల్సిందే.
సోమవారం పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా లోక్సభ ప్రతిపక్ష నేతగా రాహుల్గాంధీకి మాట్లాడే అవకాశం ఉంది. అంతకముందు బీజేపీ ఎంపీ సూర్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ వాదంపై విమర్శలు సంధించారు. దీనికి బదులుగా రాహుల్గాంధీ కౌంటర్ ఇస్తూ.. మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రాసిన ‘‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’’లోని ఆత్మకథకు సంబంధించిన అంశాలను లేవనెత్తారు. 2020లో లడక్ ఘర్షణలపై నరవణే రాసిన పుస్తకంలోని అంశాలను ఒక మ్యాగజైన్ ప్రచురించిన విషయాలను ప్రస్తావించారు. దీంతో వెంటనే కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్సింగ్ సింగ్తో పాటు స్పీకర్ ఓం బిర్లా అడ్డుకున్నారు.
ప్రచురణ జరగని అంశాలను సభలో లేవనెత్త వద్దని స్పీకర్ అడ్డుకున్నారు. సభా కార్యకలాపాలతో సంబంధంలేని ఇతర అంశాలను ఇక్కడ ప్రస్తావించొద్దని అమిత్ షా, రాజ్నాథ్సింగ్ కూడా అడ్డుతగిలారు. పుస్తకం ప్రచురణ జరగకుండా ఎవరు అడ్డుకుంటున్నారని రాహుల్ గాంధీ నిలదీశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
పుస్తకంలో అసలేముంది?
మనోజ్ నరవణే.. మాజీ ఆర్మీ చీఫ్. తన జీవితంలో జరిగిన అంశాలను ఆత్మకథగా రాసుకున్నారు. ఇందులో అనేక అంశాలను ప్రస్తావించారు. 2020లో భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలు, తూర్పు లడఖ్లో సైనిక చర్యలు, ప్రభుత్వ-సైన్యం మధ్య నిర్ణయం తీసుకునే ప్రక్రియ, వ్యూహాత్మక ఆలోచనలతో సహా అతని సైనిక అనుభవాలను వివరించారు. ఈ పుస్తకంలోని కొన్ని అంశాలు డిసెంబర్ 2023లో మీడియాలో ప్రచురించబడ్డాయి. చైనాతో ఘర్షణ సమయంలో తలెత్తిన అంశాలను ప్రస్తావించారు. ఆ సమయంలో ‘నియంత్రణ’లో లేదని పేర్కొన్నారు. పుస్తకంలోని కొన్ని అంశాలు సున్నితంగా ఉన్నాయి. ఎందుకంటే.. జాతీయ భద్రత, వ్యూహాత్మక నిర్ణయాలు నేరుగా ప్రస్తావించబడ్డాయి. దీంతో అధికారికంగా ప్రచురణకు నోచుకోలేదు.
(ఎ) 1954 ఆర్మీ రూల్స్లోని సెక్షన్ 21 ప్రకారం..సర్వీస్ సబ్జెక్టులు, భద్రతా విషయాలపై ఎటువంటి విషయాలను ప్రచురించకూడదు. ఇక సైనిక సంబంధిత సమాచారాన్ని ప్రత్యక్షంగానీ.. పరోక్షంగానీ పత్రికలకు గానీ.. ఇతర ఏ రూపంలోనూ ప్రచురణ చేయకూడదు. ఇక కేంద్ర ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా పుస్తకం లేదా కథనాన్ని ప్రచురించకూడదు. ఇక సర్వీస్ సమాచారాన్ని కూడా ఎవరితో పంచుకోవడానికి వీలుండదు. ఇవన్నీ ఆర్మీ నిబంధనలోకి వస్తాయి. ఈ నేపథ్యంలోనే మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రాసిన ఆత్మకథ అధికారికంగా ప్రచురణ జరగలేదు. రెండేళ్లుగా పెండింగ్లో ఉంది. ప్రస్తుతం సమీక్షలో ఉండడంతో ప్రచురణ జరగలేదు.
అయితే రాహుల్గాంధీ జాతీయవాదం అంశంపై పార్లమెంట్లో మాట్లాడుతూ. నరవణేకు సంబంధించిన అంశాలు ఒక మ్యాగజైన్లో ప్రచురితమైన అంశాలను లేవనెత్తారు. వెంటనే కేంద్రమంత్రులు అడ్డుతగిలారు. అంతేకాకుండా స్పీకర్ మైక్ కూడా కట్ చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు ఆందోళన దిగారు. ప్రస్తుతం ఈ అంశంపై తీవ్ర దుమారం రేపుతోంది.
