Congress: కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య మరో వివాదం చెలరేగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన,48 ఏళ్లుగా ఉపయోగిస్తున్న ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్లోని కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. గతేడాది కాంగ్రెస్ పార్టీ తన కొత్త కార్యాలయాన్ని ఇందిరా భవన్ వద్ద ప్రారంభించింది. అయినప్పటికీ, అక్బర్ రోడ్లో ఉన్న పాత కార్యాలయాన్ని ఖాళీ చేయకుండా అక్కడి నుంచే కార్యకలాపాలు చేస్తోంది.
Read Also: Iran War: పాకిస్తాన్కు షాక్ ఇచ్చిన ఇరాన్..
ఇదే కాకుండా, ఇండియన్ యూత్ కాంగ్రెస్ కార్యాలయం ఉన్న రైసినా రోడ్ ప్రాంగణాన్ని కూడా ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చినట్లు సమాచారం. ఈ పరిణామాలను కాంగ్రెస్ నాయక్తవం పరిశీలిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయం రాజకీయంగా పెద్ద వివాదానికి కారణమయ్యే అవకాశం ఉంది. ఈ వివాదంపై న్యాయ ప్రక్రియను ఆశ్రయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. కోర్టును ఆశ్రయించడం, ప్రభుత్వం నుంచి మరింత సమయం కోరడం వంటి చర్యల గురించి కాంగ్రెస్ ఆలోచిస్తోంది.
అక్బర్ రోడ్లోని ఈ కార్యాలయానికి ప్రత్యేకమైన చరిత్ర ఉంది. బ్రిటీష్ కాలంలో ఇది వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో మెంబర్గా ఉన్న సర్ రెజినాల్డ్ మాక్స్వెల్ నివాసం ఉండేది. ఆ తర్వాత 1960లలో మయన్మార్ రాయబారి నివసించారు. 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి తర్వాత ఇందిరాగాంధీ వర్గానికి కార్యాలయం అవసరం ఏర్పడింది. అప్పటి నుంచి అక్బర్ రోడ్లోని బంగ్లా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ప్రధానులుగా పనిచేసిన కాలంలో కూడా ఇదే కేంద్రంగా ఉంది. 50 ఏళ్లుగా పార్టీకి కేంద్రంగా ఉన్న ఈ కార్యాలయాన్ని ఖాళీ చేయడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.