Site icon NTV Telugu

Opposition meeting: విపక్షాల సమావేశానికి టీఆర్ఎస్‌ డుమ్మా… పద్ధతి సరిగా లేదు..!

Cm Kcr

Cm Kcr

రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడింది.. ఇవాళ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం.. ఇవాళ్టి నుంచే నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది.. మరోసారి ఏకగ్రీవంగా రాష్ట్రపతిని ఎన్నుకోవాలని భారతీయ జనతా పార్టీ ప్రయత్నాలు సాగిస్తుండగా.. ఉమ్మడి అభ్యర్థిని నిలిపేందుకు విపక్షాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. అందులో భాగంగా టీఎంసీ అధినేత్రి, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఇవాళ ఢిల్లీ వేదికగా కీలక సమావేవాన్ని ఏర్పాటు చేశారు.. బీజేపీయేతర పక్షాలకు చెందిన 20 మందికి పైగా నేతలకు ఆహ్వాలను పంపించారు.. అందులో తెలంగాణ సీఎం కేసీఆర్‌ కూడా ఉన్నారు. అయితే, విపక్షాల సమావేశానికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుంది టీఆర్ఎస్‌ పార్టీ.

Read Also: LIVE: ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్ర పారాయణం చేస్తే ధన వర్షమే..!

మొదట కేసీఆర్‌ మాత్రం వెళ్లడంలేదు… టీఆర్ఎస్‌ నుంచి ప్రతినిధులు వెళ్లారని ప్రచారం సాగినా.. అసలు ప్రతినిధులను కూడా పంపకూడదని టీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుంది.. ఆ సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీని ఆహ్వానించడంపై టీఆర్‌ఎస్ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది… కాంగ్రెస్, బీజేపీలకు తాము సమాన దూరమని స్పష్టం చేస్తోంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్‌ పార్టీయే ప్రధాన పోటీ.. కాంగ్రెస్‌తో వేదిక పంచుకునే అవకాశం లేదంటున్నాయి టీఆర్ఎస్‌ వర్గాలు.. ఇక, రాహుల్ గాంధీ.. తెలంగాణకు వచ్చి బీజేపీని పల్లెత్తు మాట అనలేదు.. కానీ, టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని మండిపడుతున్నాయి.

ఇక, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీవి కుమ్మక్కు రాజకీయాలు అని టీఆర్ఎస్‌ నేతలు ఆరోపిస్తున్నారు.. లోక్‌సభతో పాటు హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లోనే ఇది రుజువైందని.. కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయి బీజేపీని గెలిపించే ప్రయత్నం చేసింది ఆరోపణలు గుప్పిస్తున్నారు.. మరోవైపు, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం సమావేశం నిర్వహించే పద్ధతి సరిగా లేదని అంటున్నాయి గులాబీ పార్టీ వర్గాలు.. ఓ అభ్యర్థిని నిర్ణయించుకుని సమావేశం పెట్టడం సరికాదని.. రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్‌పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని టీఆర్ఎస్‌ పార్టీ ప్రకటించింది.

కాగా, ఇవాళ ఢిల్లీలో విపక్ష పార్టీల సమావేశం జరగనుంది.. మధ్యాహ్నం 3 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది.. ఈ సమావేశానికి విపక్ష పార్టీలను, ముఖ్యమంత్రులను ఆహ్వానించారు వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ.. కాంగ్రెస్ తరపున సమావేశానికి మల్లికార్జున ఖర్గే, సుర్జీవాలే, జైరాం రమేష్ హాజరుకానుండగా.. కాంగ్రెస్‌తో వేదిక పంచుకోమని టీఆర్ఎస్‌ స్పష్టం చేసింది.. ఇక, మమత బెనర్జీ ఆహ్వానించినవారిలో సమావేశానికి ఎవరొస్తారో, డుమ్మా కొట్టేదెవరో అనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే శరద్ పవార్‌తో భేటీ అయిన మమతా బెనర్జీ.. పలు విషయాలపై చర్చించారు. ఇవాళ్టి సమావేశంలో ఉమ్మడి అభ్యర్థి ప్రతిపాదనకు అంగీకరించాకే, అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉన్నట్టుగా చెబుతున్నారు.

Exit mobile version