పండుగ పూట రైల్వే ఉద్యోగులకు శుభవార్త చెప్పింది కేంద్ర ప్రభుత్వం… నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాన్ని బోనస్గా ఇవ్వాలని నరేంద్ర మోడీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.. ఈ నిర్ణయంతో రైల్వేలోని 11.56 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో.. ఉద్యోగులకు బోనస్తో పాటు రైల్వేకు సంబంధించిన పలు అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.. కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన కేంద్రమంత్రులు అనురాగ్ ఠాకూర్, పీయూష్ గోయాల్.. ఈ విషయాన్ని వెల్లడించారు. మొత్తంగా.. దీపావళి పండుగ సమయంలో రైల్వే ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది కేంద్రం.
అర్హులైన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులందరికీ 2020-21 ఆర్థిక సంవత్సరానికి 78 రోజుల వేతనాలకు సమానమైన పీఎల్బీ చెల్లింపు కోసం రైల్వే మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రివర్గం ముందు ప్రతిపాదనను సమర్పించగా.. ఈరోజు కేబినెట్ ఆమోదించింది. రైల్వేలపై ఉన్న పీఎల్బీ మొత్తం దేశమంతటా విస్తరించి ఉన్న నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులందరినీ (ఆర్పీఎఫ్/ఆర్పీఎస్ఎఫ్ సిబ్బంది మినహా) కవర్ చేస్తుంది. కాగా, అర్హత కలిగిన రైల్వే ఉద్యోగులకు బోనస్ చెల్లింపు ప్రతి ఏడాది దసరా సెలవులకు ముందు ఇస్తుంటారు. గత సంవత్సరం, భారత రైల్వే తన 11.58 లక్షల నాన్-గెజిటెడ్ ఉద్యోగులకు 78 రోజుల వేతనంతో కూడిన బోనస్ని అందించింది.