రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి ప్రకటించిన పద్మభూషణ్ పురస్కరాన్ని తిరస్కరిస్తున్నట్టు సీపీఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచార్య ప్రకటించారు. ఈ అవార్డు గురించి తనకు ఎవరూ చెప్పలేదని, ఒకవేళ నిజంగానే తనను పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసినట్టు అయితే దానిని తాను తిరస్కరిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వ వాదన మరోలా ఉంది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి మంగళవారం ఉదయం ఈ అవార్డు విషయమై బుద్ధదేవ్ భట్టాచార్య భార్యతో మాట్లాడినట్టు తెలిపింది. ఇందుకు ఆమె అంగీకరించారని, పౌరపురస్కారానికి ఎంపిక చేసినందుకు హోంమంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు కూడా తెలిపారని పేర్కొంది.
Read Also: ఎక్స్క్లూజివ్: కొత్త జిల్లాలపై ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్.. కొత్త జిల్లాల లిస్ట్ ఇదే..!!
కాగా 77 ఏళ్ల బుద్ధదేవ్ భట్టాచార్య వయసు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. నిజానికి పద్మ పురస్కరాలను తిరస్కరించడం చాలా అరుదు. ఎందుకంటే వాటిని ప్రకటించడానికి ముందే అవార్డు గ్రహీతలు వారి అంగీకారాన్ని తెలపాల్సి ఉంటుంది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులతో సత్కరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల జాబితాలో నలుగురికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 107 మందికి పద్మశ్రీ పురస్కారాలు వచ్చాయి.