Modi-Jinping: బ్రిక్స్ సమావేశాల కోసం చైనా అధ్యక్షుడు షి జిన్పింగ్ న్యూఢిల్లీ వచ్చారు. శనివారం సాయంత్రం భారత మండపంలో ఇరువురు నేతలు భేటీ కానున్నారు. భారత్-చైనా ద్వైపాక్షిక చర్చలకు చాలా ప్రాధాన్యత ఏర్పడింది. వాణిజ్య లోటు, రేర్ ఎర్త్ మినరల్స్, ఎరువు సరఫరా, వాణిజ్య ఒప్పందాల వంటి పలు కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. మోడీ-జిన్పింగ్ భేటీపై ప్రపంచ దృష్టి నెలకొంది.
అరుదైన ఖనిజాలపై చర్చ:
ప్రపంచ టెక్నాలజీకి ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్, రేర్ ఎర్త్ మాగ్నెట్స్ కీలకంగా మారాయి. ఈ రంగంలో చైనా 90 శాతం వాటాను నియంత్రిస్తోంది. భారతదేశం ఈ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రయత్నిస్తోంది. సెమీకండక్టర్ రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో, భారత ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, ఈవీ, బ్యాటరీ, రక్షణ, హైటెక్ తయారీ రంగాలకు ఈ అరుదైన రేర్ ఎర్త్ మెటల్స్ చాలా కీలకం. రేర్ ఎర్త్ మెటల్స్ గురించి భారత్, చైనా మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.
వాణిజ్య లోటు:
భారత దేశానికి సంబంధించి ఆందోళన కలిగించే అంశం చైనాతో ఉన్న వాణిజ్యలోటు. చైనా నుంచి భారత్ భారీ స్థాయిలో దిగుమతులు చేసుకుంటోంది. ఇదే సమయంలో చైనాకు భారత ఎగుమతులు చాలా తక్కువగా ఉన్నాయి. 2025లో, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం సుమారుగా $155.6 బిలియన్లకు చేరుకోగా, చైనాతో భారతదేశ వాణిజ్య లోటు సుమారుగా $115 బిలియన్లుగా ఉంది. భారత్ చైనా నుంచి ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, యంత్రాలు, రసాయనాలు, సౌర పరికరాలు, ఇతర వస్తువుల్ని కొనుగోలు చేస్తోంది. ఈ చర్చల్లో భారత వస్తువులకు చైనా తన మార్కెట్ తెరిచేలా ప్రోత్సహించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
మోడీ-జిన్పింగ్ భేటీపై ప్రపంచం దృష్టి:
2020లో గాల్వాన్ సంఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇరు దేశాలు ప్రస్తుతం చర్చలు, వాణిజ్య సంబంధాలను పెంపొందించుకోవడం వల్ల ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుతున్నాయి. ఏడేళ్ల తర్వాత తొలిసారి జిన్పింగ్ భారత్ వస్తుండటం, మోడీతో భేటీ అవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. జనాభా పరంగా, ఆర్థిక పరంగా అతిపెద్ద దేశాలుగా ఉన్న చైనా, భారత్ కలిసి పనిచేస్తే అది ప్రపంచానికి సహాయంగా ఉంటుంది. దీంతో ఈ భేటీపై ప్రపంచ దృష్టి నెలకొంది.

