NTV Telugu Site icon

Delhi: ఆప్‌కి భారీ షాక్.. బీజేపీలో చేరిన కౌన్సిలర్లు..

Aap Bjp

Aap Bjp

Delhi: వచ్చే ఏడాది ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రస్తుతం ఢిల్లీలో అధికారంలో ఉంది. అయితే, తాజాగా ఆ పార్టీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆప్‌కి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు ఈ రోజు బీజేపీలో చేరారు. బీజేపీ అగ్ర నేతలు రాంవీర్ సింగ్ బిధూరి, అరవిందర్ సింగ్ లవ్లీ, యోగేంద్ర చందోలియా సమక్షంలో వారంతా కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. వీరితో పాటు ఆప్‌కి చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన కార్పొరేటర్లలో బవానాలోని షహబాద్ డెయిరీ (వార్డ్ నంబర్ 28) నుండి రామ్ చంద్ర, బవానాలోని వార్డు నంబర్ 30 నుండి పవన్ సెహ్రావత్, బదర్‌పూర్ వార్డు నంబర్ 180 నుండి మంజు నిర్మల్, వార్డు నంబర్ 178 నుండి సుగంధ బిధురి ఉన్నారు. తుగ్లకాబాద్, హర్కేష్ నగర్‌లోని వార్డు నంబర్ 177కు ప్రాతినిధ్యం వహిస్తున్న మమత పవన్ ఉన్నారు.

Read Also: Ram Mohan Naidu: మంత్రి లోకేష్ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తారు..

ఆప్ కౌన్సిలర్లు బీజేపీలో చేరడంపై బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్ మాట్లాడుతూ.. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని పార్టీ పనితీరుపై అసంతృప్తితో ఉన్న నాయకులు ఈ రోజు మా పార్టీలో చేరారని, దేశాభివృద్ధికి ప్రధాని మోడీ చేసిన అభివృద్ధి పనుల నుంచి స్పూర్తి పొందారని, ఢిల్లీ అభివృద్ధికి ఆప్ అడ్డంకులు సృష్టిస్తున్న తీరుపై వారంతా విసిగిపోయి ఉన్నారని అన్నారు.

2020 ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాలకు గానూ ఆప్ 62 స్థానాల్లో గెలిచింది. బీజేపీ కేవలం 8 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ కేసులో జైలులో ఉన్నాడు. మరోవైపు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని 8 ఎంపీ సీట్లలో ఆప్ ఒక్కదాంట్లో కూడా విజయం సాధించలేదు. బీజేపీ మొత్తం స్థానాలను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో వరసగా ఆప్ పార్టీని నేతలు వీడుతుండటం ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఢిల్లీ అసెంబ్లీకి 2025లో ఎన్నికలు జరగనున్నాయి.