బీహార్లో హైవోల్టేజ్ ఎన్నికల వేళ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబానికి బిగ్ షాక్ తగిలింది. ఐఆర్సీటీసీ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, భార్య రబ్రీ దేవిపై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు అభియోగాలు మోపింది. మోసం, నేరపూరిత కుట్రకు సంబంధించిన సెక్షన్ల కింద, అలాగే అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు మోపింది. మోసం, కుట్ర నేరం కింద ఐపీసీ సెక్షన్లు 420, 120 బీ కింద అభియోగాలు మోపింది. అయితే తాము నిర్దోషులమని.. ఈ కేసు తప్పుడు కేసు అని రబ్రీ దేవి కొట్టిపారేశారు.
ఇది కూడా చదవండి: Karur Stampede: కరూర్ తొక్కిసలాటపై కీలక పరిణామం.. సీబీఐ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశాలు
2004-2009 వరకు లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టుల కేటాయింపులో అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. రెండు ఐఆర్సీటీసీ హాటళ్లు, బీఎన్ఆర్ రాంచీ, బీఎన్ఆర్ పూరీల నిర్వహణ కాంట్రాక్టును సుజాత హోటల్కు అప్పగించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఒప్పందానికి ఉపకారంగా ఒక బినామీ కంపెనీ ద్వారా మూడు ఎకరాల ప్రధాన భూమిని లాలూ కుటుంబం పొందినట్లుగా సీబీఐ ఆరోపించింది.
ఇది కూడా చదవండి: Hamas-Israel: ఇజ్రాయెల్లో పండుగ వాతావరణం.. రెండేళ్ల తర్వాత బందీల విడుదల
2017లో లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన కుటుంబ సభ్యులపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. నిందితులందరిపై అభియోగాలు మోపడానికి తగిన ఆధారాలు ఉన్నాయని ఢిల్లీ కోర్టుకు సీబీఐ తెలిపింది. అభియోగాలు మోపడానికి ఎటువంటి ఆధారాలు లేవని, టెండర్లు న్యాయంగా జరిగాయని లాలూ యాదవ్ తరపు న్యాయవాది వాదించారు. తాజాగా ఢిల్లీ కోర్టు అభియోగాలు నమోదు చేసింది.
ప్రస్తుతం ఈ పరిణామం ఎన్నికల వేళ లాలూ కుటుంబానికి పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పొచ్చు. ప్రత్యర్థులకు అస్త్రాలుగా మారనున్నట్లు కనిపిస్తోంది. లాలూ ఫ్యామిలీపై అవినీతి అస్త్రంగా ప్రత్యర్థి పార్టీలు ప్రయోగించే అవకాశం ఉంది. ఎన్నికల్లో ప్రత్యర్థులు.. ఆర్జేడీని అస్త్రంగా ఉపయోగించుకోవచ్చు.
బీహార్లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు మాత్రం నవంబర్ 14న జరగనుంది. ఓ వైపు ఎన్డీఏ-ఇండియా కూటమిలు నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ చేస్తుండగా.. ఇంకోవైపు ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ఎన్నికల అరంగ్రేటంతో పోరాడుతున్నారు. అయితే ఈసారి ప్రజలు ఏ పార్టీకి అధికారం కట్టబెడతారో వేచి చూడాలి.