Bhupen Borah: మరో కాంగ్రెస్ కీలక నేత ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల ముందు హస్తం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తాకింది. అస్సాం మాజీ పీసీసీ చీఫ్ భూపెన్ బోరా బీజేపీలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ శర్మ చెప్పారు. భూపెన్ బోరా ఫిబ్రవరి 22న బీజేపీలో చేరుతున్నట్లు హిమంత ప్రకటించారు. అస్సాంలో కీలకమైన నేతగా ఉన్న బోరా, కాంగ్రెస్ను వీడటం తప్పకుండా ఎన్నికలపై ప్రభావం పడుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also: Iran: హార్ముజ్ జలసంధిలో ఇరాన్ మిస్సైల్స్ ప్రయోగం..
అంతకుముందు, హిమంత బోరా రాజీనామా గురించి మాట్లాడుతూ.. ‘‘ భూపెన్ బోరా అస్సాం కాంగ్రెస్ లో అట్టడుగు స్థానం నుంచి ఎదిగిన ప్రముఖ హిందూ నేత. ఆయన ఆహ్వానం మేరకు ఈ సాయంత్రం ఆయనను కలవనున్నాను. బీజేపీలో ఆయన చేరితే అస్సాం, దేశ సేవలో మరింత బలం చేకూరుతుంది’’ అని అన్నారు. బోరా 2021 నుంచి 2025 వరకు అస్సాం కాంగ్రెస్ చీఫ్గా పనిచేశారు. గౌరవ్ గొగోయ్ అస్సాం కాంగ్రెస్ చీఫ్గా నియమితులయ్యే వరకు బోరా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నారు.
బోరా కాంగ్రెస్కు రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. 32 ఏళ్లగా పార్టీ కోసం పనిచేస్తున్నా, ఇప్పుడు విస్మరించారని, తనకు తగిన గౌరవం కల్పించలేదని ఆయన ఆరోపించారు. ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గేలా కాంగ్రెస్ అగ్ర నాయకులు సర్దిచెప్పాలని ప్రయత్నించినా, వెనక్కి తగ్గలేదు.
