Assam Flood: అస్సోం రాష్ట్రంలో భారీ వరదలు ముంచెత్తాయి. వరదలతో ధేమాజీలో ఆదివారం మరో ఇద్దరు మరణించారు. దీంతో, ఈ ఏడాది వరదలు, తుఫాన్, కొండ చరియలు విరిగిపడటంతో దాదాపు 44 మందికి పైగా చనిపోయారని అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ అధికారులు పేర్కొన్నారు. భారీ వర్షాలతో దిబ్రూగఢ్ లోని బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తుండటంతో పాటు శివసాగర్ లోని మరో రెండు నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. సోనిత్ పూర్, బార్ పేట, కరీం గంజ్ లోని నదులు ఉప్పొంగిపోయాయి. అసోంలోని 12 జిల్లాల్లో 2. 62 లక్షల మంది వరదల వల్ల ప్రభావితమైనట్లు అధికారులు చెప్పుకొచ్చారు. దాదాపు 671 గ్రామాలు జలదిగ్బంధంలోకి వెళ్లినట్లు చెప్పారు. ఇక, 2, 593 మంది నిరాశ్రయులు కాగా.. 44 సహాయ శిబిరాల్లో తలదాచుకుంటున్నారని స్టేట్ డిజాస్టర్ అధికారులు తెలిపారు.
అయితే, పలు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపారు. ధేమాజీ జిల్లాలో 300 మంది, టిన్సుకియాలో 20 మంది, దిబ్రూగఢ్ లో ముగ్గురిని బోట్ల ద్వారా రక్షించిట్లు అధికారులు చెప్పారు. ధేమాజీ జిల్లాలో పడవల ద్వారా దాదాపు వెయ్యి జంతువులను సైతం సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇవే కాకుండా, పలు ప్రాంతాల్లో వరదల వల్ల రోడ్లు, వంతెనలు, కట్టలు, అంగన్వాడీ కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక, కేంద్రమంత్రి సోనోవాల్ దిబ్రూగఢ్ నియోజకవర్గంలో వరద పరిస్థితిని పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అత్యవసర సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బ్రహ్మపుత్ర నది ప్రమాద స్థాయిని దాటడంతో.. అక్కడ వరద పరిస్థితిని కూడా కేంద్రమంత్రి పరిశీలించారు.