ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే మరోసారి పోరాటానికి దిగనున్నారు. ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీని అన్నా హజారే తీవ్రంగా తప్పుబట్టారు. వెంటనే ఈ కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ఫిబ్రవరి 14 నుంచి అమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. కొత్త మద్యం పాలసీ ప్రకారం సూపర్ మార్కెట్లలో, జనరల్ స్టోర్లలో మద్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read Also: Petrol Prices: సామాన్యులకు షాక్ తప్పదా? భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు
ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీపై సర్వత్రా వ్యతిరేకత వస్తోంది. దీంతో అన్నా హజారే స్పందించి వెంటనే ప్రభుత్వానికి లేఖ రాశారు. మద్యం పాలసీని వెనక్కి తీసుకోవాలని లేఖలో సీఎం ఉద్ధవ్ థాక్రేను కోరారు. జనరల్ స్టోర్లు, సూపర్మార్కెట్లలో మద్యం విక్రయించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైంది కాదని పేర్కొన్నారు. ఇది రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు మంచిది కాదన్నారు. దీనికి బదులు ప్రజలు మద్యానికి బనిసలు కాకుండా చర్యలు తీసుకుంటే బాగుంటుందని లేఖలో అన్నా హజారే సూచించారు. ఈ అంశంపై ఇప్పటికే డిప్యూటీ సీఎం అజిత్ పవార్ కు లేఖ కూడా రాసినట్లు తెలిపారు. కానీ ఆయన నుంచి ఇంత వరకు స్పందన లేదని హజారే చెప్పారు.