Uddhav Thackeray: మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మాజీ హోంమంత్రి దేశ్ముఖ్ సంచలన ఆరోపణలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతో పాటు మరో ముగ్గురు ‘మహా వికాస్ అఘాడీ’ నేలపై తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయాలని బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ తనపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. తనపై దర్యాప్తు నిలిపేయడానికి ఫడ్నవీస్ ఈ ప్రతిపాదన చేసినట్లు దేశ్ముఖ్ ఆరోపించారు. అయితే, దేశ్ముఖ్ చేసిన వ్యాఖ్యలను ఫడ్నవీస్ ఖండించారు.
‘‘మూడేళ్ల క్రితం దేవేంద్ర ఫడ్నవీస్ ఉద్ధవ్ ఠాక్రే, ఆదిత్య ఠాక్రే, అనిల్ పరబ్, అజిత్ పవార్లపై తప్పుడు ఆరోపలు చేస్తూ అఫిడవిట్ ఇవ్వాలని నన్ను అడిగారు. అందుకు నేను నిరాకరించాను. అందుకే నాపైకి ఈడీ, సీబీఐలను పంపారు. 13 నెలల పాటు జైలులో ఉంచారు’’ అని ఎన్సీపీ(శరద్ పవార్) నేత అయిన అనిల్ దేశ్ముఖ్ చెప్పారు.
Read Also: Shruti Haasan: అప్పుడే పదిహేనేళ్లా? డాటర్ ఆఫ్ కమల్ టు శృతి జర్నీ!
శివసేన- ఎన్సీపీ- కాంగ్రెస్ పార్టీల ‘మహా వికాస్ అఘాడీ’ ప్రభుత్వంలో అనిల్ దేశ్ముఖ్ మహారాష్ట్ర హోం మంత్రిగా పనిచేశారు. ముంబైలోని హోటల్, బార్ యజమానుల నుంచి డబ్బులు వసూలు చేయమని పోలీసు అధికారుల్ని ఆదేశించారని అప్పటి ముంబై కమిషనర్ ఆరోపించడంతో అనిల్ దేశ్ముఖ్ 2021లో తన హోం మంత్రి పదవికి రాజీనామా చేశారు. నవంబర్ 2021లో మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయగా, ఏప్రిల్ 2022లో అవినీతి కేసులో సీబీఐ చేత అరెస్ట్ చేయబడ్డాడు.
అయితే, ఈ ఆరోపణలపై డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. అవన్నీ నిరాధారమైనవని ఖండించారు. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్లపై దేశ్ముఖ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన అనేక వీడియోలు తన వద్ద ఉన్నాయని పేర్కొన్నారు. నాపై తప్పుడు ఆరోపణలు చేస్తే ఆ వీడియోలను బహిరంగపరచడం తప్ప వేరే మార్గం లేదని అన్నారు. దేశ్ముఖ్కి చెందిన ఆధారాలనపు ఫడ్నవీస్ బయటపెట్టాలని మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే ఆందోళనకు దిగారు. దేశ్ముఖ్ చెప్పేదే నిజం కావచ్చు, ప్రధాని మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందని పటోలే చెప్పారు.