Air Chief AP Singh: ఇటీవల ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత వైమానిక దళం సత్తా చాటింది. ముఖ్యంగా, అత్యంత ఖచ్చితత్వంతో మిస్సైల్ అటాక్స్ చేసింది. అయితే, తాజాగా వైమానిక దళ అధిపతి అమర్ ప్రీత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఒక అధికారిక కార్యక్రమంలో మాట్లాడుతూ.. రక్షణ రంగ ప్రాజెక్టుల్లో ఆలస్యంపై తన అసంతృప్తిని వెళ్ళగక్కారు.”చాలాసార్లు, ఒప్పందాలపై సంతకం చేస్తున్నప్పుడు ఆ వ్యవస్థలు ఎప్పటికీ రావని మాకు తెలుసు. కాలపరిమితి ఒక పెద్ద సమస్య. నేను ఆలోచించగలిగే ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా సమయానికి పూర్తి కాలేదు. సాధించలేని దానిని మనం ఎందుకు వాగ్దానం చేయాలి?” అని అన్నారు.
రక్షణ ప్రాజెక్టుల ఆలస్యంపై ఆయన అనేక ఉదాహరణలు వెల్లడించారు. ముఖ్యంగా స్వదేశీ ప్రాజెక్టులకు సంబంధించిన విషయాలను ఎత్తిచూపారు. లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (LCA) కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ, ఫిబ్రవరి 2021లో హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)తో సంతకం చేసిన రూ. 48,000 కోట్ల ఒప్పందం కింద కవర్ చేయబడిన తేజస్ Mk1A ఫైటర్ జెట్ డెలివరీలు నిలిచిపోయాయని, ఇప్పటివరకు ఆర్డర్ చేసిన 83 విమానాలలో ఏవీ డెలివరీ చేయలేదని ఎయిర్ చీఫ్ అన్నారు. డెలివరీ మొదట మార్చి 2024లో ప్రారంభం కావాల్సి ఉంది.
Read Also: Deputy CM Bhatti: దేశంలో ఎక్కడ లేని విధంగా ఇందిరమ్మ ఇళ్లకు రూ. 5 లక్షలు ఇస్తున్నాం..
ఐఏఎఫ్ చీఫ్ చెబుతున్న దాని ప్రకారం, తేజస్ Mk1A ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్తో సహా అనేక కీలక ప్రాజెక్టులను ప్రభావితం చేసిందని చెబుతున్నారు. మూడేళ్ల క్రితం ఈ ఒప్పందం కుదిరింది. దీనిపై ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘తేజస్ Mk1 డెలివరీలు ఆలస్యం అయ్యాయి. తేజస్ Mk2 యొక్క నమూనా ఇంకా అందుబాటులోకి రాలేదు. స్టీల్త్ AMCA యుద్ధ విమానం యొక్క నమూనా ఇంకా అందుబాటులోకి రాలేదు” అని CII వార్షిక వ్యాపార సదస్సులో అన్నారు, దీనికి రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా హాజరయ్యారు.
ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ కింద స్వదేశీ ఆయుధాల, ఫైటర్ జెట్స్ తయారీకి ప్రాధాన్యత ఇస్తున్న క్రమంలో వైమానిక దళాధిపతి నుంచి ఈ వ్యాఖ్యలు రావడం గమనార్హం. ‘‘ మనం భారతదేశంలో ఉత్పత్తి గురించి మాత్రమే మాట్లాడలేము. మనం డిజైన్ గురించి మాట్లాడాలి. దళాలు, పరిశ్రమల మధ్య మనకు నమ్మకం ఉండాలి. మనం ఏదైనా చేయడానికి కట్టుబడి ఉంటే, మనం డెలివరీ చేయాలి. భారతదేశంలో తయారు చేయడానికి వైమానిక దళం తన వంతు కృషి చేయడానికి ప్రయత్నిస్తోంది” అని ఆయన అన్నారు.
భవిష్యత్ కోసం సిద్ధంగా ఉండటానికి మనం ఇప్పుడే సిద్ధంగా ఉండాలని, 10 ఏళ్లలో మనకు పరిశ్రమల నుంచి ఎక్కువ ఉత్పత్తి ఉంటుందని, మనకు ఈ రోజు ఏం కావాలో అవి తప్పక కావాలని, మనం త్వరగా మన చర్యల్ని సమన్వయం చేసుకోవాలని ఆయన అన్నారు. ఇదే సమయంలో ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ ని ఏపీ సింగ్ ప్రశంసించారు. భారత సైనిక చర్యలో 100కు పైగా ఉగ్రవాదులు హతమైనట్లు చెప్పారు.