సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన’అగ్నిపథ్’ స్కీమ్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు మిన్నంటుతున్నాయి. హైదరాబాద్ లోని సికింద్రాబాద్ లోనే కాకుండా..పలు రాష్ట్రాల్లో యువత చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. ఉత్తరప్రదేశ్, బిహార్ లో నిరసనకారులు పలు రైళ్లకు నిప్పు పెట్టారు. యూపీలోని బల్లియాలో నేటి ఉదయం కొంతమంది నిరసనకారులు రైల్వే స్టేషన్లోకి ప్రవేశించి పట్టాలపై ఆగిన రైళ్లకు నిప్పుపెట్టారు. స్టేషన్లోని ఆస్తులను ధ్వంసం చేశారు. అయితే రైళ్లలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని ఆందోళనకారులను చెదరగొట్టారు. మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.
మరోవైపు బిహార్ లోని మొహియుద్దినగర్ స్టేషన్లోనూ జమ్మూ తావి ఎక్స్ప్రెస్ రైలుకు చెందిన రెండు బోగీలకు నిరసనకారులు నిప్పంటించారు. ఈ ఘటనలోనూ ఎవరికీ ఎటువంటి హానీ జరగలేదని పోలీసులు తెలిపారు. లఖ్మినియా రైల్వే స్టేషన్ వద్ద ఆందోళనకారులు పట్టాలపై కూర్చొని నిరసన చేపట్టారు. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దిల్లీలోనూ ఈ నిరసనలు జరిగాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో దిల్లీలోని పలు మెట్రో స్టేషన్ల వద్ద భద్రతను పెంచారు.
యూపీలోని బల్లియా రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు రైలుకు నిప్పుపెట్టడంతో పోలీసులు అక్కడకు చేరుకుని మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో మండుతున్న రైలు నుంచి మిగిలిన బోగీలను వేరు చేసేందుకు పోలీసులంతా వాటిని తోసేశారు. దీంతో కొంతమేర ఆస్తినష్టం తప్పింది.
త్రివిధ దళాల్లో నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంపై పెద్ద ఎత్తున విమర్శలు, నిరసనలు వ్యక్తమవుతున్నాయి. నాలుగేళ్ల తర్వాత 75 శాతం మందిని నిరుద్యోగులుగా మార్చే ఈ పథకం వద్దని, పాత పద్దతిలో సైన్య నియామక ప్రక్రియ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అగ్నిపర్పై సందేహాలు తీర్చేందుకు కేంద్రం నిన్న ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ పథకంతో అగ్నివీరుల భవిష్యత్తుకు ఎలాంటి ఢాకా ఉండదని వివరణ ఇచ్చింది. మరోవైపు.. గత రెండేళ్లుగా కొవిడ్-19తో సైన్యంలో భర్తీ ప్రక్రియ చేపట్టని కారణంగా 2022లో జరిపే అగ్నివీరుల నియామకానికి గరిష్ఠ వయోపరిమితిని 23 ఏళ్లకు పెంచుతున్నట్లు రక్షణశాఖ వెల్లడించివిషయం తెలిసిందే.
Agneepath Scheme: సికింద్రాబాద్ ఎఫెక్ట్.. అన్ని రైల్వేస్టేషన్లకు భారీ భద్రత