ఆఫ్ఘనిస్తాన్లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. తాలిబన్ల ఆక్రమణలతో ప్రజలు భీతిల్లిపోతున్నారు. ఎటునుంచి ఎవరు దాడులు చేస్తారో అని ప్రాణాలు గుప్పిట పట్టుకొని దొరికిన విమానం పట్టుకొని దేశం విడిచి పారిపోతున్నారు. సామాన్యులతో పాటుగా ఆఫ్ఘన్ నేతలు కూడా వివిధ దేశాలకు పారిపోతున్నారు. గత ప్రభుత్వంలోని నేతలను ఏమి చేయబోమని తాలిబన్లు హామీ ఇస్తున్నా, వారి హామీలను ఎవరూ నమ్మేస్థితిలో లేరనే సంగతి తెలిసిందే. ఇలా ఆఫ్ఘన్ నుంచి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని వచ్చిన ఎంపీ నరేందర్ సింగ్ ఖల్సా… ఇండియాలో దిగగానే భోరున ఏడ్చేశాడు. ఆఫ్ఘన్ పరిస్థితులు దారుణంగా మారిపోయాయని, 20 ఏళ్లు కష్టపడి నిర్మించుకున్న అభివృద్ధి ఒక్కసారిగా పేకమేడలా కుప్పకూలిపోయిందని, ఇప్పుడు ఆఫ్ఘన్లో జీరో అభివృద్ధి ఉందని, తాలిబన్ల చేతిలో ఆఫ్ఘనిస్తాన్ ఎంత దారుణంగా మారిపోతుందో తలచుకుంటేనే భయం వేస్తోందని అన్నారు.