Aditya Thackeray’s key comments on Maharashtra politics: మహారాష్ట్ర రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారుతున్నాయి. శివసేన కీలక నేత ఎంపీ సంజయ్ రౌత్ ను ఈడీ అరెస్ట్ చేయడంతో ఉద్ధవ్ ఠాక్రే వర్గం మండిపడుతోంది. పత్రాచల్ భూముల వ్యవహారంలో మస్కామ్ జరిగిందని ఆరోపిస్తూ ఈడీ సంజయ్ రౌత్ ను అరెస్ట్ చేసింది. మరోవైపు కోర్టు అనుమతితో సంజయ్ రౌత్ ను అదుపులోకి తీసుకోనుంది ఈడీ.
ఇదిలా ఉంటే ఆదిత్య ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. సింధుదుర్గ్ లో ఓ సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ మహారాష్ట్రను 5 భాగాలుగా విభజించాలని చూస్తున్నట్లు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బీజేపీ, సీఎం ఏక్ నాథ్ షిండే ఉద్దేశపూర్వకంగా ప్రాంతీయతత్వాన్ని తీసుకువచ్చి.. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని భావిస్తున్నారని ఆరోపించారు. ఉద్ధవ్ ఠాక్రే ఎప్పుడు కూడా తమపై వివక్ష చూపలేదని అన్నారు. ద్రవ్యోల్భనం, నిరుద్యోగం సమస్యలు ఉన్నా.. వారు మాత్రం రాజకీయాలు, ఇతర పార్టీలు, ఇతర ఎమ్మెల్యేలను విచ్ఛిన్నం చేసే పనిలో ఉన్నారని విమర్శించారు. ప్రజా సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చి రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పేవారిని అణచివేస్తున్నారని.. వారిని లక్ష్యంగా చేసుకుంటున్నారని విమర్శించారు.
Read Also: UPI Transactions: యూపీఐ లావాదేవీల్లో కొత్త చరిత్ర

ఇటీవల గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ చేసిన వ్యాఖ్యల గురించి కూడా ఆదిత్య ఠాక్రే ప్రస్తావించారు. గుజరాతీలు, రాజస్థానీలు లేకపోతే ముంబై ఆర్థిక రాజధానిగా ఉండదనే వ్యాఖ్యలను ఖండించారు. ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఎంపీ సంజయ్ రౌత్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంపీ సంజయ్ రౌత్ ను ఈడీ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఉద్ధవ్ ఠాక్రేతో పాటు ఆయన వర్గం నేతలు సంజయ్ రౌత్ ఇంటికి వెళ్లారు.