AAP MP Sanjay Singh’s comments on buying TRS MLAs: తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వ్యవహారంపై ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీపై విరుచుకుపడుతోంది. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేందుకు బీజేపీ ఆధ్వర్యంలో ఆపరేషన్ లోటస్ జరుతోందని ఆప్ఆ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలోనే తెలంగాణలో ఆపరేషన్ లోటస్ జరుగుతోందని ఆయన అన్నారు. వందల కోట్లు ఖర్చుపెట్టి బీజేపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తోందని అన్నారు.
బీజేపీకి తెలంగాణలో కేవలం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారని.. టీఆర్ఎస్ పార్టీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని.. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే ప్రయత్నాలు స్పష్టంగా తెలుస్తున్నాయని అన్నారు. 43 మంది ఎమ్మెల్యేలు మాతో టచ్ లో ఉన్నారని చెబుతున్నట్లు ఆడియోలో ఉందని.. బీజేపీ కిడ్నాపింగ్ గ్యాంగ్ గా మారిందని ఆయన అన్నారు. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, మేఘాలయ, గోవా, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. ప్రభుత్వాలను కూల్చారని ఆరోపించారు. దేశం మొత్తంలో బీజేపీ కిడ్నాపింగ్ గ్యాంగుల ఆధ్వర్యంలో ప్రభుత్వాలను కూల్చే కార్యక్రమం జరుగుతోందని అన్నారు. ఇలా చేసే బదులు దేశంలో ఎన్నికలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
Read Also: Madhya Pradesh: ఇండోర్ లో ఘోరం.. దొంగతనం చేశారని ట్రక్కి కట్టి ఈడ్చేశారు.
ఆడియోలో అమిత్ షా పేరు కూడా ఉందని.. పార్టీలో ప్రముఖ వ్యక్తి బీఎల్ సంతోష్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చిందని సంజయ్ సింగ్ అన్నారు. కేంద్ర హోం మంత్రి నేతృత్వంలోనే ఈ కిడ్రాపింగ్ గ్యాంగ్ నడుస్తుందని ఆరోపించారు. కేంద్ర హోం మంత్రే ఇలాంటి చర్యలకు పాల్పడుతుంటే ఇంకేం ఉంటుందని ఆయన అన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రిగా అమిత్ షాను తొలగించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో 43 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు తెచ్చిన డబ్బులు ఎక్కడ దాచారో తేలాలని అన్నారు.
సీబీఐ, ఈడీ లాంటి సంస్థలు తమ జేబులో ఉన్నాయని బీజేపీ దళారులు ఆడియోలో చెబుతున్నారని.. 104 మంది ఎమ్మెల్యేల బలం ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలనుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. ముగ్గురు దళారులు పట్టుబడ్డారని.. ఇప్పుడు అన్ని ఆధారాలు ఉన్నాయని అన్నారు. గతంలో ఢిల్లీలో జరిగిన ఆపరేషన్ లోటస్ ని విఫలం చేశామని సంజయ్ సింగ్ అన్నారు. ఈ రకంగా ఉంటే దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఎలా బతుకుతుందని ప్రశ్నించారు. తక్షణమే బీజేపీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.