Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలోని తిరువణ్ణామలైలోని అన్నామలై ఆలయ ప్రాంగణంలో ఒక వ్యక్తి మాంసాహారం తింటున్నట్లు కనిపించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చెలరేగింది. ఆలయంలోని నాల్గవ ప్రహారం (బయటి ప్రాంగణం) ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ వ్యక్తి నాన్ వెజ్ తింటున్నట్లు భక్తులు గమనించి వెంటనే ఆలయ అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఆలయాధికారులు అతడి దగ్గరికి వచ్చి ఏం తింటున్నాడని ప్రశ్నించగా.. సదరు వ్యక్తి తాను ‘కుస్కా’ (సాదా బిర్యానీ) ఆర్డర్ చేసుకున్నాను. కానీ, పొరపాటున దాంతో పాటు చికెన్ ముక్కను ప్యాక్ చేశారని తెలిపాడు.
దీంతో ఆలయ అధికారులు ఆ వ్యక్తి తినే ఆహారాన్ని ప్యాక్ చేయించి.. వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అలాగే, విచారణ కోసం ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, హిందువుల మనోభావాలు దెబ్బ తీసేందుకు తరుచూ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారని రాష్ట్ర బీజేపీ నేతలు మండిపడుతున్నారు. స్టాలిన్ ప్రభుత్వంలో హిందువులను కించపర్చేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అయితే, జనవరిలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. మధురైలోని పవిత్రమైన తిరుపరంకుండ్రం సుబ్రమణ్య స్వామి కొండ దగ్గర ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ నేత, రామనాథపురం ఎంపీ నవాస్ ఖనిని మాంసాహారం తిన్నారని బీజేపీ నేత కె. అన్నామలై ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ నాయకుడి మాటలను ఐయూఎంఎల్ ఎంపీ ఖండించారు. తప్పుడు ప్రచారాలు చేయడంలో బీజేపీ మొదటి వరుసలో ఉంటుందని అతడు పేర్కొన్నాడు.