5 Killed In Fire At Fireworks Godown In Madurai: తమిళనాడులో ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా గోడౌన్ లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటన గురువారం మధురై జిల్లాలోని తిరుమంగళం లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఐదుగురు మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేశాయి. అయితే ప్రమాదానికి కారణం ఇంకా తెలియరాలేదు. ఇది ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంగా సింధుపట్టి పోలీసులు వెల్లడించారు.
Read Also: Gujarat Elections: రవీంద్ర జడేజా భార్యకు… మోర్బీ ఘటనలో ప్రజల్ని కాపాడిన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్
శిథిలాల లోపల మరిన్ని మృతదేహాలు చిక్కుకునే అవకాశాలు ఉన్నందున మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు దాటికి చాలా మృతదేహాలు ఛిద్రమయ్యాయి. మృతుల గుర్తింపు కష్టంగా మారినట్లు తెలుస్తోంది. ఈ గోడౌన్ లో బాణాసంచా తయారీతో పాటు స్టోరేజ్ గా కూడా ఉపయోగిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. క్రాకర్స్ తయారీకి లైసెన్సు ఉన్నట్లు గుర్తించారు. ఈ ప్రమాదంతో ఇప్పటి వరకు ఐదుగురు మరణించగా.. మరో 10 మంది గాయపడ్డారు. వీరందరికి చికిత్స అందిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ రోజు తెల్లవారుజామున మాల్దీవుల్లోని గ్యారేజీలో అగ్నిప్రమాదం సంభవించి 10 మంది మరణించారు. ఇందులో 8 మంది భారతీయులే ఉన్నారు. మవేయో మసీదు సమీపంలోని ఎం నిరుఫెహి ప్రాంతంలో అర్థరాత్రి 12.30 గంటలకు మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. భారత రాయబార కార్యాలయం ఈ ఘటనపై సంతాపాన్ని వ్యక్తం చేసింది.