గుజరాత్ డ్రగ్స్ కేసు ప్రకంపణలు సృష్టిస్తోంది. లింకులు ఎక్కడెక్కడో బయటపడుతున్నాయ్. ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన సోదాల్లో భారీగా మత్తు పదార్థాలు పట్టుబడ్డాయ్.
గుజరాత్ డ్రగ్స్ కేసును సీరియస్గా తీసుకుంది DRI. కేసులో ఇప్పటి వరకు 8 మందిని కటకటాల్లోకి నెట్టింది. వీరిలో నలుగురు అఫ్ఘాన్ దేశస్తులు, ముగ్గురు భారతీయులు, ఒకరు ఉజ్బెకిస్తాన్కు చెందిన వ్యక్తి ఉన్నాడు. సుధాకర్ దంపతులతో పాటు మరో ఇద్దరిని చెన్నైలో పట్టుకున్నారు డీఆర్ఐ అధికారులు. కాందహార్ నుంచి హెరాయిన్ తెప్పించి ఇక్కడ స్మగ్లింగ్ చేస్తున్నట్లు గుర్తించారు.
టాల్కమ్ పౌడర్ పేరుతో హెరాయిన్ను స్మగ్లింగ్ చేస్తున్నట్లు తేల్చారు. డ్రగ్స్ అని గుర్తుపట్టకుండా ఉండేందుకు టాల్కమ్ పౌడర్ బస్తాల్లో మత్తు మందు జల్లుతున్నట్టు గుర్తించారు అధికారులు.
డ్రగ్స్ దిగుమతి వెనుకాల ఢిల్లీకి చెందిన కుల్దీప్సింగ్ పాత్ర ఉందని DRI తెలిపింది. గుజరాత్ ముందా పోర్ట్లో కంటైనర్ పట్టుకున్నాక దేశవ్యాప్తంగా దాడులు చేశారు. ఢిల్లీ, నోయిడా, చెన్నై, కోయంబత్తూరు , మాండ్వి, గాంధీధామ్, విజయవాడలోనూ సోదాలు నిర్వహించారు. ఢిల్లీ గోడౌన్లో 16 కిలోలు, నోయిడాలో 11 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 3వేల 400 కిలోల హెరాయిన్ స్వాధీనం.